శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 9 డిశెంబరు 2019 (20:55 IST)

షాద్ నగర్ ఎన్ కౌంటర్ పై సుప్రీంలో పిల్: అర్జంట్ హియరింగ్..!

హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ లో వెటర్నరి డాక్టర్ దిశపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి, హత్యకు పాల్పడిన నలుగురు కామాంధులను ఎన్ కౌంటర్ చేసిన ఉదంతంపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో ప్రజా వ్యాజ్యం (పిల్) దాఖలైంది. జీఎస్ మణి అనే వ్యక్తి ఈ పిటీషన్ ను దాఖలు చేశారు. సుప్రీంకోర్టు దీన్ని విచారణకు స్వీకరించింది. అర్జంట్ హియరింగ్ కింద విచారణ చేపట్టింది. ఈ పిల్ పై బుధవారం సమగ్ర విచారణ చేపట్టనుంది.
 
పౌర సంఘాల నుంచి నిరసన
వెటర్నరి డాక్టర్ దిశపై కిందటి నెల 27వ తేదీన శంషాబాద్ వద్ద మహమ్మద్ ఆరిఫ్ పాషా, జొల్లు నవీన్, జొల్లు శివ, చెన్నకేశవులు అమానవీయంగా అత్యాచారం, హత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు నిందితులనూ సైబరాబాద్ పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.

ఎన్ కౌంటర్ పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నప్పటికీ.. పౌర సంఘాలు, మానవ హక్కుల సంఘాల ప్రతినిధులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ సైతం ఈ విషయంపై దర్యాప్తు చేపట్టింది.
 
బుధవారం సమగ్ర విచారణ
ఇదే అంశంపై జీఎస్ మణి అనే పౌర హక్కుల ప్రతినిధి సుప్రీంకోర్టులో ప్రజావ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సైబరాబాద్, హైదరాబాద్ పోలీసులను ప్రతివాదులుగా చేర్చారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఎ బొబ్డె దీన్ని విచారణకు స్వీకరించారు. అర్జంట్ హియరింగ్ కింద ఈ పిల్ పై విచారణకు అనుమతి ఇచ్చారు.

ఎన్ కౌంటర్ ఉదంతంపై బుధవారం సమగ్ర విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు. ఇందులో భాగంగా సుప్రీంకోర్టు సైబరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయానికి నోటీసులను జారీ చేయనుంది.
 
చట్టవ్యతిరేకమనే భావన..
వెటర్నరి డాక్టర్ దిశ హత్యోదంతంలో నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేసిన ఉదంతాన్ని చట్ట వ్యతిరేకమని భావిస్తున్నారు పౌర హక్కుల సంఘాల ప్రతినిధులు. చట్టాలు, న్యాయాలకు అతీతంగా, వాటిని దుర్వినియోగం చేస్తూ హైదరాబాద్ పోలీసులు ఈ ఎన్ కౌంటర్ కు పాల్పడ్డారని, చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వామపక్ష పార్టీల నాయకులు వారికి మద్దతు పలుకుతున్నారు.
 
చట్టబద్ధమా? కాదా?
దిశ నిందితుల ఎన్ కౌంటర్ చట్టబద్ధమా? కాదా? అనే కోణంలో సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఎలాంటి పరిస్థితులు, కారణాల మధ్య నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందనే విషయంపై హైదరాబాద్ పోలీసులు.. సుప్రీంకోర్టుకు సహేతుకమైన కారణాలను వివరించాల్సి ఉంటుందని అంటున్నారు.

ఇప్పటికే జాతీయ మానవ హక్కుల కమిషన్ సైతం దీనిపై విచారణ చేపట్టిన నేపథ్యంలో.. దీన్ని కూడా ఇందులో విలీనం చేస్తారా? లేదా? అనేది తేలాల్సి ఉందని చెబుతున్నారు.