శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2019 (20:22 IST)

ప్రైవేటు దిశగా రైల్వే

రైళ్లు.. ప్రైవేటుకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా అహ్మదాబాద్–‌‌ముంబై, ఢిల్లీ–లక్నో తేజస్ ఎక్స్ ప్రెస్ లను ప్రయోగాత్మకంగా రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్​సీటీసీ) నడుపుతుందని రైల్వే నిర్ణయించినట్లు అధికార వర్గాలు చెప్పాయి.

ముందుగా పైలెట్ ప్రాజెక్టుగా ఈ రెండు రైళ్లను మూడేళ్లపాటు ఐఆర్​సీటీసీకి అప్పగించేందుకు రైల్వే బోర్డు నిర్ణయించింది. రైలు బోగీలపై అడ్వర్టయిజ్​మెంట్ హక్కులు ఐఆర్​సీటీసీ కలిగి ఉంటుంది.

రైలు సెక్యూరిటీకి ప్రమాదం లేకుండా కోచ్ ల లోపలి వైపు మార్పులు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఏడాది పాటు టికెట్ల అమ్మకాలకు రైల్వే వెబ్ పోర్టల్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ రెండు రైళ్ల రెవెన్యూ అకౌంట్లను విడిగా నిర్వహిస్తామని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.
 
వారానికి ఆరు రోజులు నడిచే ఈ రెండు రైళ్లలో ఎటువంటి రాయితీలు చెల్లవు. డ్యూటీ పాసులకు అనుమతి ఉండదని అధికారులు చెప్పారు. టికెట్ ధరను కూడా ఐఆర్​సీటీసీనే నిర్ణయిస్తుంది. టికెట్ల ధరలు మాత్రం సామాన్యుడికి అందుబాటులోనే ఉంటాయని చెప్తున్నారు.

ఐఆర్​సీటీసీ ఆధ్వర్యంలో నడిచే ఈ రైళ్లలో.. రైల్వే సిబ్బంది ఆన్-బోర్డు టికెట్ తనిఖీ చేయరని, గార్డ్స్, లోకో పైలట్, స్టేషన్ మాస్టర్ వంటి విధుల్లో మాత్రం రైల్వే సిబ్బందే ఉంటారని తెలిపారు. ఈ రెండు రైళ్ల సర్వీసులకు శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రాధాన్యమే ఉంటుంది. ఏమైనా ప్రమాదం జరిగితే, ఐఆర్​సీటీసీ ప్రయాణికులను రైల్వే ప్రయాణికులతో సమానంగా చూస్తామని, ప్రమాదానికి సంబంధించిన క్లెయిమ్స్ చేసుకునేందుకు అర్హత వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.

ప్రమాదం జరిగినప్పుడు సర్వీసులు అందించడం, పునరుద్ధరించే బాధ్యతలు రైల్వే తీసుకుంటుందని తెలిపారు. వరల్డ్ క్లాస్ సేవలు అందించేందుకు ప్రైవేటు ట్రైన్ ఆపరేటర్లను తీసుకురావాలని ఇప్పటికే రైల్వే తన వంద రోజుల ప్రణాళికలో ప్రతిపాదించింది. రెండు తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఐఆర్ సీటీసీకి అప్పగించడం ఆ దిశగా వేస్తున్న మొదటి అడుగు అని అధికారులు చెప్తున్నారు.