పొంచివున్న కరవు... స్టాక్ మార్కెట్లో రూ.లక్ష కోట్ల సంపద ఆవిరి!
దేశంలో ఈ యేడాది కూడా వర్షపాతం ఆశాజనకంగా ఉండదని, ఫలితంగా కరవు తాండవించడం ఖాయమంటూ భారత వాతావరణ శాఖ ఇచ్చిన నివేదిక స్టాక్ మార్కెట్లో తీవ్ర ప్రభావం చూపింది. దీనికితోడు వడ్డీరేట్లను తగ్గిస్తూ భారత రిజర్వు బ్యాంకు తీసుకున్న నిర్ణయం కూడా ప్రభావం చూపింది. దీంతో స్టాక్ మార్కెట్లో లక్ష కోట్ల రూపాయల నిధులు ఆవిరైపోయాయి.
మంగళవారం మార్కెట్ సెషన్ ముగిసేసరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 660.61 పాయింట్లు పడిపోయి 2.37 శాతం నష్టంతో 27,188.38 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సూచి 196.95 పాయింట్లు పడిపోయి 2.34 శాతం నష్టంతో 8,236.45 పాయింట్ల వద్ద కొనసాగాయి.
నిఫ్టీ-50లో మూడు కంపెనీలు మాత్రమే లాభాల్లో నిలిచాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ 237 పాయింట్లు, స్మాల్క్యాప్ 232 పాయింట్లు దిగజారాయి. జీఎంటర్టైన్మెంట్, లుపిన్, భారతీ ఎయిర్టెల్ మాత్రమే 0.22 నుంచి 2.58 శాతం వరకూ లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్, ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ తదితర సంస్థలు నాలుగు శాతానికిపైగా నష్టపోయాయి.