శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : మంగళవారం, 11 డిశెంబరు 2018 (18:29 IST)

చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. కేసీఆర్ ప్రధాని అవుతారా?

తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్.. పక్క రాష్ట్రపు సీఎం చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవడాన్ని.. నాలుగు పార్టీలను ఏకం చేసుకుని ప్రచారం చేయడాన్ని కేసీఆర్ తప్పుబట్టారు. చంద్రబాబు ఇక్కడ చేసింది.. తాను అక్కడ చేయాలి కదా అంటూ ప్రశ్నించారు.


చంద్రబాబుకు పైత్యం వుందని.. ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. దాని ఫలితం ఎలా వుండబోతుందో త్వరలో చంద్రబాబు చూస్తారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. 
 
ఇక ప్రధాని తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పచ్చి అబద్ధాలు చెప్తున్నారని.. ఎన్నికల నేపథ్యంలో సర్జికల్ స్ట్రైక్స్, మందిర్ మాట ఎత్తుతున్నారని గుర్తు చేశారు. దేశంలో మార్పు ఎప్పుడు వస్తుంది. మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ప్రజలను అగౌరవపరిచే పద్ధతి మారాలన్నారు. దేశంలో కాంగ్రెస్ ముక్త్, బీజేపీ ముక్త్ పాలన రావాలని పిలుపు నిచ్చారు. కాంగ్రెస్, బీజేపీల తలబిరుసు దేశానికి శాపంగా మారిందన్నారు. దేశాన్ని, రాష్ట్రాలను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని అడిగారు. 
 
తమకు ఎవ్వరూ బాసులు లేరని, ఏజెంట్లం కామన్నారు. ప్రజలే మమ్మల్ని ఏజెంట్లు చేశారు. జాతీయ రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేస్తామని కేసీఆర్ తెలిపారు. దేశానికి 70వేల టీఎంసీల నీరు అందుబాటులో వున్నా.. కానీ 30 వేల టీఎంసీల‌ను మాత్ర‌మే వాడుతున్నారని ఆరోపించారు. డివైసివ్ పాలిటిక్స్ నుంచి దేశం బ‌య‌ట‌ప‌డాల‌న్నారు. 
 
కాంగ్రెస్‌, బీజేపీ నేత‌లు సిగ్గుపడాలి, దేశానికి కొత్త ఆర్థిక విధానం అవ‌సరం, కొత్త వ్య‌వ‌సాయ విధానం కావాల‌న్నారు. కేవ‌లం ఉత్ప‌త్తిపైన మాత్ర‌మే ప్ర‌భుత్వాలు ఆలోచిస్తున్నాయ‌ని, ఇజ్రాయిల్‌, చైనాతో పోలిస్తే మ‌నం ఎక్క‌డ ఉన్నామో తేల్చుకోవాలన్నారు. 
 
విశ్లేష‌కులు అశోక్ గులాటి ఓ ఆర్టిక‌ల్ రాశారని కేసీఆర్ గుర్తు చేశారు. రైతుల‌కు ఏం చేయాల‌న్న అంశాన్ని అద్భుతంగా రాయడమే కాకుండా.. టీఆర్ఎస్ తెలంగాణలో ఏం చేసిందో కూడా రాశారని గుర్తు చేశారు. రైతు పెట్టుబ‌డితో రైతుల‌కు ఫ్రీడం ఇచ్చేశామ‌న్నారు. స్వామినాథ‌న్ కూడా తెలంగాణ ప‌థ‌కాల‌ను మెచ్చుకున్నారన్నారు. 
 
నేటి నుంచి దేశ రాజ‌కీయాల‌పై దృష్టి పెట్ట‌నున్న‌ట్లు కేసీఆర్ వ్యాఖ్యానించారు. పెసిమిస్టిక్‌గా కాకుండా అప్టిమిస్టిక్‌గా వుండాలని చెప్పారు. కొందరు డర్టీ, సిల్లీ పాలిటిక్స్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. త్వరలో దేశంలో మార్పు కోసం హస్తినకు వెళ్తానని కీలక నేతలను కలిసి గుణాత్మక మార్పు తెస్తానని పునరుద్ఘాటించారు.
 
ఇక కేసీఆర్ వ్యాఖ్యలను బట్టి దేశ రాజకీయాల్లో ఆయన చక్రం తిప్పే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు సీఎంగా కేటీఆర్‌ను ప్రకటించి.. దేశ రాజకీయాలపై దృష్టి పెట్టి.. రైతు అంశాన్ని చేతికి తీసుకుని.. ముందుకెళ్తే.. దేశ ప్రధాని అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఉత్తరాది, దక్షిణాదిని అభివృద్ధి దిశగా పయనింపజేసేందుకు రాజకీయ ప్రముఖులతో భేటీ అనంతరం కేసీఆర్ కీలక మార్పు తెస్తారని అప్పుడే ప్రచారం మొదలైంది. 
 
దీంతో ఏపీ సీఎం చంద్రబాబు ప్రజా కూటమికి చెక్ పెట్టడమే కాకుండా.. ఏపీ రాజకీయాల్లోనూ కేసీఆర్ జోక్యం చేసుకుంటారని తెలుస్తోంది. ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ జోక్యం చేసుకుంటే.. అభివృద్ధి సాధ్యమేనని.. విభజన తర్వాత వెనకబడి వున్న ఏపీని దారికి తెచ్చే సామర్థ్యం కేసీఆర్‌కు వుందని కూడా ప్రచారం మొదలైంది. ఇదే జరిగితే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో మార్పు సంభవమని రాజకీయ పండితులు జోస్యం చెప్తున్నారు.