శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : సోమవారం, 10 డిశెంబరు 2018 (18:00 IST)

కేసీఆర్ సాబ్.. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు : అసదుద్దీన్ ఓవైసీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠగా మారాయి. గెలుపు ఎవరిది అనేది ఆసక్తికరంగా మారింది. విజయం తమదే అని ఇటు తెరాస, అటు ప్రజాకూటమి నాయకులు ధీమాగా ఉన్నారు. అయితే పరస్పరంభిన్నంగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అందరిని కలవరపెడుతున్నాయి. 
 
ఈ పరిస్థితుల్లో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. వీరిద్దరూ 3 గంటల పాటు పలు అంశాలపై చర్చలు జరిపారు. 
 
ఆ తర్వాత అసదుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో భారీ మెజార్టీతో తెరాస సర్కారు ఏర్పాటు కానుంది. ఏ ఒక్క పార్టీ మద్దతు లేకుండానే తెరాస ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుంది. కేసీఆర్ సాబ్ మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవని అసద్ వ్యాఖ్యానించారు. 
 
ఎంఐఎం మద్దతు లేకుండా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. అయితే, తెరాకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపారు. జాతి నిర్మాణంలో ఇది తొలి అడుగు అంటూ ట్వీట్ చేశారు. మరికొన్ని గంటల్లో ఫలితాలు రానున్న తరుణంలో కేసీఆర్‌తో అసద్ భేటీ రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. 
 
తెలంగాణ ప్రజలంతా కేసీఆర్‌ను ఆశీర్వదిస్తున్నారని.. ఆయన వెంటనే ఉన్నారని తెలిపారు. తెలంగాణలో మరోసారి కేసీఆర్ సీఎం కానున్నారు. ఎంఐఎం నుంచి 8 మంది ఖచ్చితంగా గెలుస్తారని ధీమా వ్యక్తంచేశారు. భారతీయ జనతా పార్టీ బలమేంటో రేపు తేలిపోతుందన్నారు. గతంలో వచ్చిన సీట్లు కూడా ఆ పార్టీకి రావన్నారు. అదేసమయంలో తాము 8 చోట్ల గెలుస్తామని అసదుద్దీన్ జోస్యం చెప్పారు.