మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By

స్ట్రాంగ్ రూమ్‌లకు గట్టి భద్రత.. కౌంటింగ్‌కు చకచకా ఏర్పాట్లు

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓటరు భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైవుంది. ఈ ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లకు గట్టిభద్రతను కల్పించారు. సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి మూడు అంచెల భద్రతతో హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. 
 
ఈవీఎం యంత్రాలను పోలింగ్ ముగిసిన వెంటనే గట్టి భద్రత నడుమ అధికారులు స్ట్రాంగ్‌రూమ్‌లకు చేర్చారు. ఈవీఎంలతోపాటు అదనంగా ఉంచిన రిజర్వు ఈవీఎంలూ స్ట్రాంగ్‌ రూమ్స్‌కు చేరాయి. రూమ్స్‌ లోపల, బయట సీసీ కెమెరాలతోపాటు కేంద్ర, రాష్ట్ర బలగాలతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. నిరంతరం కరెంట్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకున్నారు.
 
స్ట్రాంగ్ రూమ్‌లకు వంద మీటర్ల పరిధిలోకి ఎవరినీ అనుమతించటం లేదు. ఆ పరిసరాల్లోకి వచ్చే వారిని వీడియో తీస్తున్నారు. మూడు షిఫ్టుల్లో 13 మంది పోలీసులు డ్యూటీలో ఉంటున్నారు. స్ట్రాంగ్‌ రూమ్స్‌ దగ్గర సీసీ కెమెరాలను ఆయా జిల్లాల ఎస్పీ ఆఫీసుల కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేశారు. 
 
మరోవైపు, పోలింగ్‌ పూర్తవ్వడంతో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై ఎన్నికల యంత్రాంగం దృష్టి పెట్టింది. డిసెంబర్ 11వ ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభంకానుంది. కౌంటింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్‌ను ఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల కమిషన్‌, హైదరాబాద్‌ నుంచి సీఈవో రజత్‌కుమార్‌ పర్యవేక్షిస్తారు. 
 
ప్రతి  సెంటర్‌లో కనీసం 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తారు. ప్రతి టేబుల్ దగ్గర ఏజెంట్లు, సూపర్ వైజర్, అసిస్టెంట్ సూపర్ వైజర్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు. మొదట పోస్టల్‌ బ్యాలెట్లు, సర్వీస్‌ ఓట్లను కౌంట్ చేస్తారు. కౌంటింగ్ పూర్తయ్యాక క్రాస్‌ చెకింగ్‌ కోసం ఏదో ఒక పోలింగ్‌ బూత్‌కు సంబంధించిన వీవీ ప్యాట్‌‌ స్లిప్‌లను, ఆ బూత్‌లో అభ్యర్థికి వచ్చిన ఓట్లు లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో 45 కౌంటింగ్‌ సెంటర్లను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.