శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Modified: బుధవారం, 5 డిశెంబరు 2018 (18:12 IST)

తెలంగాణలో ఎన్నికల ఊరేగింపులకు నో... 7వ తేదీ పోలింగ్...

తెలంగాణ రాష్ట్ర శాసనసభకు పోలింగ్ జరుగుతున్న అన్ని నియోజకవర్గాల్లో నేటి సాయంత్రం నుండి బహిరంగ సభలు నిర్వహించడం నిషిద్ధమని ప్రధాన ఎన్నికల అధికారి డా.రజత్ కుమార్ తెలియచేసారు. 13 నియోజక వర్గాల్లో- సిర్పూర్, చెన్నూర్(ఎస్.సి), బెల్లంపల్లి(ఎస్.సి), మంచిర్యాల్, అసిఫాబాద్ (ఎస్.టి), మంథని, భూపాలపల్లి, ములుగు(ఎస్.టి), పినపాక(ఎస్.టి), ఎల్లందు (ఎస్.టి), కొత్తగూడెం, అశ్వారావుపేట(ఎస్.టి), భద్రాచలం (ఎస్.టి) లలో ఈ రోజు (డిసెంబరు 5వతేదీ) సాయంత్రం 4 గంటల నుండి 48 గంటలు  నిషేధం ఉంటుంది. 
 
 
మిగతా నియోజక వర్గాల్లో ఈ రోజు (డిసెంబరు 5 సాయంత్రం) 5 గంటల నుండి 48 గంటలు నిషేధం అమలవుతుందని ఆయన అన్నారు. ఈ నిషేధిత సమయంలో బహిరంగ సభల నిర్వహణ, దానిని ఉద్దేశించి మాట్లాడడం, పాల్గొనడం లేదా ఎన్నికల ఊరేగింపులు తీయడం, సినిమాలు, టివీలు లేదా ఇతర పరికరాల ద్వారా ఎన్నికల సందేశాలను ప్రసారం చేయడం, అలాగే ఎలక్ట్రానిక్ ప్రచారసాధనాలలో ఒపీనియన్ సర్వేలు, ఇతరత్రా ఎన్నికల సంబంధిత కార్యక్రమాలను ప్రసారంచేయడం కూడా నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని ఆయన తెలియచేసారు. 
 
ఏ పోలింగ్ జరిగే ప్రాంతంలోకూడా వినోదానికి సంబంధించిన కచ్చేరీలు, స్టేజ్ కార్యక్రమాల వంటివి కూడా అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేసారు. ఈ నిబంధనలను ఉల్లంఘించినవారికి చట్ట ప్రకారం రెండేళ్ళ వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశముందని ఆయన వివరించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 126 కింద ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ప్రధాన ఎన్నికల అధికారి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.