మంగళవారం, 15 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 జులై 2025 (16:02 IST)

మహిళలను దూషించడమే హిందుత్వమా? మాధవీలత

madhavilatha
ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన గోషా మహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌లపై ఆ పార్టీ నాయకురాలు హైదరాబాద్ పార్లమెంట్ నియోజవర్గ ఇన్‌చార్జ్ మాధవీలత విమర్శలు గుప్పించారు. బీజేపీ మద్దతు లేకుండా రాజాసింగ్ ఎమ్మెల్యేగా గెలుపొందారా? అని ప్రశ్నించారు. కార్పొరేటర్‌గా ఉన్న రాజాసింగ్‌ను ఎమ్మెల్యే చేసింది బీజేపీనే అని చెప్పారు. బీజేపీ నుంచి ఏది పడితే మాట్లాడటం సరికాదని అన్నారు. ఇతర మతాల వారిని, మహిళలను దూషించడమే హిందుత్వమా? అని ప్రశ్నించారు. 
 
హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన తనకు రాజాసింగ్ సహకరించలేదని మాధవీలత విమర్శించారు. ఎంపీ అభ్యర్థిగా మగాళ్లే దొరకలేదా? అంటూ తన గురించి హేళనగా మాట్లాడారని మండిపడ్డారు. గోషామహల్‌లో రాజా సింగ్ కంటే తనకే ఎక్కువగా ఓట్లు వచ్చాయని అన్నారు. మాధవీలత బలహీనురాలు కాదని చెప్పారు. గోషామహల్ స్థానాన్ని తనతో భర్తీ చేయాలని హైకమాండ్ భావిస్తుండటం తన అదృష్టమని అన్నారు. గోషామహల్, జూబ్లీహిల్స్ ఎక్కడ పోటీ చేయమన్నా బరిలోకి దిగేందుకు తాను సిద్ధమని చెప్పారు. 
 
భార్యతో మాట్లాడుతూ తుపాకీతో కాల్చుకున్న జవాను... 
 
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భార్యతో ఫోనులో మాట్లాడుతూ ఓ జవాను తుపాకీతో కాల్చుకున్నాడు. ఈ ఘటన రాయ్‌పూర్‌‍లోని 65వ బెటాలియన్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రీసత్యసాయి జిల్లా, కనగానపల్లి మండలం శివపురంకొట్టాలకు చెందిన జవాన్ కంచుకోట మురళి (30) ఆదివారం రాత్రి పది గంటల సమయంలో తన భార్య లోకపావనితో ఫోనులో మాట్లాడాడు. భోజనం అయిందా? పిల్లలు తిన్నారా? అని అడిగాడు. నాన్న ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోందని, జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు. 
 
చెల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని, పిల్లలను బాగా చదివించి గొప్పస్థానంలో ఉంచుదామని చెప్పాడు. ఇప్పటికే రూ.34 లక్షల అప్పు అయిందని, నువ్వు కుటుంబానికి ఆసరాగా ఉండి జాగ్రత్తగా చూసుకోవాలని కోరాడు. ఆ తర్వాత 'సెలవు' అని చెప్పి తుపాకితో కాల్చుకున్నాడు.
 
పావని పిలిచినా అటునుంచి స్పందన రాలేదు. సమీపంలోని సహచర జవాన్ శబ్దం విని చూసే సరికి మురళి నేలపై కుప్పకూలిన స్థితిలో కనిపించాడు. మురళి 2017లో సీఆర్పీఎఫ్ జవాన్‌గా చేరాడు. అనంతపురానికి చెందిన లోకపావనిని ఐదు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి నాలుగేళ్ల కుమారుడు తారక్ రామ్, రెండేళ్ల కుమార్తె మహి ఉన్నారు.మురళి తండ్రి ముత్యాలన్న చర్మ కేన్సర్‌తో బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ చికిత్స కోసం దాదాపు 30 లక్షల రూపాయల అప్పు తీసుకున్నారు. అదేసమయంలో మురళి సోదరికి పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. 
 
ఇదిలావుంటే, నాలుగు నెలల క్రితం మురళి కారును స్నేహితుడు నడుపుతుండగా పెనుకొండ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో కారు నంబర్ ఆధారంగా మురళిని సంప్రదించిన మృతుడి కుటుంబం కేసు రాజీ కోసం 15 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది. దీంతో తండ్రి వైద్యం కోసం దాచిన రూ.4 లక్షలను వారికి ఇచ్చాడు. దీంతో మొత్తం అప్పు రూ.34 లక్షలకు చేరుకుంది. తండ్రి ఆరోగ్యం బాగా లేకపోవడంతో 15 రోజుల క్రితం బెంగళూరుకు వచ్చిన మురళి తిరిగి బెటాలియన్‌కు చేరుకున్నాడు. ఆదివారం రాత్రి ఆర్థిక ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.