సంబంధిత వార్తలు
గంట ఆలస్యంగా వచ్చారని తిట్టిన లెక్చరర్ - ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని
కాలేజీకి గంట ఆలస్యంగా వచ్చినందుకు విద్యార్థులను లెక్చర్ తిట్టారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన సికింద్రాబాద్ సమీపంలోని వెస్ట్ మారేడ్ పల్లిలో జరిగింది. పోలీసు కథనం మేరకు.. వెస్ట్ మారేడుపల్లికి చెందిన విద్యార్థిని (17) ఎంఆర్ బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి ఏడాది చదువుతోంది.
గురువారం కళాశాలకు గంట ఆలస్యంగా రావడంతో లెక్చరర్స్.. తోటి విద్యార్థుల ఎదుటే ఆమెను మందలించారు. దీంతో మానసికంగా కుంగిపోయిన విద్యార్థిని ఇంటికి వెళ్లి తల్లితో విషయం చెప్పింది. తర్వాత వెళ్లి మాట్లాడదామని తల్లి కుమార్తెను సముదాయించింది.
ఇంతలోనే విద్యార్థినికి తలనొప్పి రావడంతో స్పృహ తప్పి కింద పడిపోయింది. వెంటనే మల్కాజిగిరి ఆసుపత్రికి తరలించారు. అనంతరం గాంధీ ఆసుపత్రికి తరలించి సిటీ స్కాన్ చేయించారు. విద్యార్థిని ఎడమ చేయి, కాలు కూడా పనిచేయలేదు. స్కానింగ్ చేసిన వైద్యులు.. తీవ్ర మనస్తాపానికి గురికావడంతో బ్రెయిన్లో రక్తం గడ్డ కట్టిందని చెప్పారు.
అనంతరం రాత్రి బాలిక మృతి చెందింది. దీంతో శుక్రవారం ఉదయం కళాశాల ముందు ఆమె తల్లిదండ్రులు, ఎమ్మార్పీఎస్ నేతలు, ఓయూ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. వెంటనే సదరు లెక్చరర్స్, ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
