1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 15 అక్టోబరు 2023 (14:17 IST)

న్యాయపరమైన అంశాల వల్లే సిట్టింగ్‌ స్థానాల్లో మార్పులు చేశాం : సీఎం కేసీఆర్

kcrao
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో మార్పులు చేశారు. దీనిపై సీఎం కేసీఆర్ ఆదివారం క్లారిటీ ఇచ్చారు. న్యాయపరమైన అంశాల కారణంగా పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాల్లో కొన్నిచోట్ల మార్పులు చేయాల్సి వచ్చిందని తెలిపారు. బీఆర్ఎస్ జాబితా విడుదల అనంతరం తొలిసారిగా తెలంగాణ భవన్‌లో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో కేసీఆర్‌ సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'కొన్నిచోట్ల అభ్యర్థుల్లో మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చింది. వేములవాడలో వాస్తవానికి మార్చాల్సిన అవసరం లేదు. న్యాయపరమైన అంశాల వల్ల వేములవాడ అభ్యర్థిని మార్చాం. మార్పులు, చేర్పులు అన్నీ సానుకూలంగా జరిగాయి. ఎన్నికల వేళ కోపతాపాలు ఉంటాయి.. సహజమే. అభ్యర్థులకు ఓపిక, సంయమనం అవసరమన్నారు. 
 
అలాగే, మన నాయకులపై గతంలో కొన్ని కేసులు పెట్టారు. మనవాళ్లు గెలిచినా సాంకేతికంగా ఇబ్బంది పెడతారు. వనమా వంటి నాయకుల విషయంలో అలా జరిగింది. సందేహాలు ఉంటే మన న్యాయబృందాన్ని సంప్రదించండి. నామినేషన్ల విషయంలో అజాగ్రత్త వద్దు. ఆదివారం, సోమవారాల్లో బీఫామ్‌లు అందిస్తాం. ఒక్కో అభ్యర్థికి రెండు బీ బీఫామ్‌లు అందిస్తాం అని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి సీఎం కేసీఆర్‌ మధ్యాహ్నం భోజనం చేయనున్నారు. భోజన విరామం తర్వాత భారాస ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించనున్నారు.