శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 21 సెప్టెంబరు 2020 (19:55 IST)

నాలాలో పడిపోయిన సుమేధ.. కేటీఆర్‍పై ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

సైకిల్‌పై వెళుతూ సుమేధ అనే బాలిక నాలాలో పడిపోయింది. దీనదయాళ్‌నగర్‌ ఓపెన్‌ నాలా వెంట వెతగ్గా రోడ్డు నంబర్‌ నాలుగు దగ్గర అదే నాలాలో బాలిక సైకిల్‌ కనిపించింది. ఆ నాలా వెంబడి రెండు కిలోమీటర్ల దూరంలోని బండ చెరువు దాకా గాలించగా అక్కడ బాలిక మృతదేహాన్ని దొరికింది. కూతురు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
 
ఇదే ప్రాంతంలో గతంలోనూ ఓ మహిళ నాలాలో పడి మరణించింది. గత ఏడాది పాత బస్తీ, ఎల్‌బీ నగర్‌లో ఇదే తరహా ఘటనలు జరిగాయి. రోడ్డుకు సమాంతరంగా ఉండడంతో వరద ముంచెత్తినప్పుడు ఓపెన్‌ నాలాల్లో పడి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ విభాగాలు పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. 
 
ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి కేటీఆర్‌పై నేరేడ్‌మెట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సుమేధ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేటీఆర్‌తో పాటు మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్, స్థానిక కార్పొరేటర్, సంబంధిత ఏఈ, డీఈలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 
 
సుమేధ మృతికి కారణమైన అందరిపై సెక్షన్ 304 కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఇటీవల నేరెడ్‌మెట్‌లోని దీన్‌దయాళ్‌నగర్‌లో సరదాగా సైకిల్‌పై బయటకు వెళ్లిన చిన్నారి సుమేధ (12) ప్రమాదవశాత్తు నాలాలో పడి మృతి చెందింది.