1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (08:37 IST)

అందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు: కేటీఆర్‌

రాష్ట్రంలో ఇల్లు లేని వారందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని, అర్హులదరికీ పింఛన్లు ఇస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు హామీ ఇచ్చారు.

పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మహబూబ్‌నగర్‌లో ఆయన ప్రారంభించారు. మరో మంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్‌తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

ఈ సందర్భంగా పట్టణంలోని పాతతోట బస్తీలో పాదయాత్ర చేసి.. పలువురి ఇళ్లలోకి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాగా, 
 
మూడేళ్ల క్రితం ఇదే బస్తీలో సీఎం కేసీఆర్‌ పర్యటించారు. అప్పుడు పాతతోట వాసులందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికి 86 ఇళ్లను కట్టించారు. మిగిలినవారు తమకు కూడా డబుల్‌ బెడ్‌రూం ఇల్లు కావాలని కేటీఆర్‌ను కోరడంతో అందరికీ ఇళ్లు వస్తాయని చెప్పారు. 
 
అనంతరం కౌన్సిలర్లు, వార్డు కమిటీల సభ్యులు, అధికారులతో జరిగిన సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. రాజకీయాలకతీతంగా పట్టణాల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని చెప్పారు.

పట్టణాల్లో పౌరసేవలే కేంద్రంగా కొత్త మునిసిపల్‌ చ ట్టాన్ని సీఎం కేసీఆర్‌ రూపొందించారని తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమం కేసీఆర్‌ మానసపుత్రిక అని అన్నారు.

పారిశుధ్య పనుల నిర్వహణలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు, ప్రజలతో మునిసిపల్‌ సిబ్బంది మమేకమయ్యేందుకు గ్రేటర్‌ హైదరాబాద్‌లో చేపట్టిన పరిచయ కార్యక్రమాన్ని అన్ని మునిసిపాలిటీల్లో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 
 
రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఆయా చోట్ల స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభించారు.

వనపర్తి, పెబ్బేరు మునిసిపాలిటీల్లో మంత్రి నిరంజన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గద్వాలలో పంచాయతీరాజ్‌ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమంతో ప్రభుత్వం సాంఘిక మార్పునకు శ్రీకారం చుట్టిందని తెలిపారు.