శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 31 జనవరి 2020 (20:44 IST)

భవన నిర్మాణ పర్మిషన్ కోసం త్వరలో టీఎస్‌ బీపాస్‌: కేటీఆర్

తెలంగాణలో త్వరలోనే భవన నిర్మాణ అనుమతుల కోసం టీఎస్‌ బీపాస్‌ను ప్రవేశ పెట్టనున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. భవన నిర్మాణ అనుమతులు కూడా పారదర్శకంగా, అవినీతికి ఆస్కారం లేకుండా ఉండేందుకు ఈ కొత్త విధానాన్ని తీసుకు వస్తామని చెప్పారు.

మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో క్రెడాయ్ ప్రాపర్టీ షో-2020 ను కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు. దీని ద్వారా నగరంలో నిర్మాణాల్లో అక్రమాలు తగ్గుతాయన్నారు. ఎప్పుడైతే నిర్మాణ దారులకు అనుమతుల్లో ఇబ్బందులు తలెత్తుతాయో అప్పుడే అక్రమ నిర్మాణాలకు తావుంటుందన్నారు.

నిర్మాణ అనుమతులుపారదర్శకంగా ఉంటే అక్రమ నిర్మాణాలు కూడా ఉండవన్నారు. ఎవరైనా భవన నిర్మాణ అనుమతి తీసుకోవాలంటే టీఎస్‌ బీపాస్‌ దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందన్నారు.
 
అంతేకాదు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) చుట్టూ మరిన్ని పరిశ్రమలు రాబోతున్నాయని తెలిపారు మంత్రి కేటీఆర్. నగరంలో మరో పదిహేనేళ్ల పాటు ఇదే వేగంతో వృద్ధి కొనసాగుతుందన్నారు.

మౌలిక వసతుల కల్పన కోసం వారం రోజుల్లో మరో ‘మెట్రో’ కారిడార్ ప్రారంభించబోతున్నామని, మెట్రోలైన్ ను నాగోల్ నుంచి శంషాబాద్ వరకు విస్తరిస్తామని చెప్పారు. హైదరాబాద్ ప్రధాన రోడ్ల నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తామన్నారు.

పార్కింగ్ సమస్యలను పరిష్కరించేందుకు కొత్త పాలసీని తీసుకొస్తామని.. ఫార్మా సిటీని కూడా ఈ ఏడాదే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్.