శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 9 డిశెంబరు 2022 (10:47 IST)

బీఆర్ఎస్‌గా మారిన తెరాస.. నేడు దివ్య ముహూర్తంలో ఆవిర్భావ సభ

kcrao
ఉద్యమ పార్టీగా పురుడు పోసుకుని ఆ తర్వాత రాజకీయ పార్టీగా అవతరించిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఇపుడు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా అవతరించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా తెరాసను బీఆర్ఎస్‌ పేరు మార్చి గుర్తింపునిచ్చింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఒక లేఖ కూడా రాసింది. దీంతో శుక్రవారం ఓ దివ్య ముహూర్తంలో ఆవిర్భావ సభలో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించనున్నారు. 
 
ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం 1.20 గంటలకు దివ్య ముహూర్తంలో బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన లేఖపై సీఎం కేసీఆర్ కూడా సంతకం చేయనున్నారు. ఆ మరుక్షణమే బీఆర్ఎస్ పార్టీ ఉనికిలోకి వస్తుంది. తెరాస కనుమరుగవుతుంది. 
 
ఈ సందర్భంగా బీఆర్ఎస్ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమం ర్వాత పార్టీ కార్యాచరణపై ఆయన కీలక నేతలతో చర్చలు జరుపుతారు. అలాగే, బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమానికి ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలు, పొలిట్ బ్యూరో సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా అధ్యక్షులు ఇలా ప్రతి ఒక్కరూ హాజరుకానున్నారు.