శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : శుక్రవారం, 26 అక్టోబరు 2018 (10:32 IST)

జగన్‌పై దాడి.. తీవ్రంగా ఖండించిన కవిత.. ఇదో పిరికిపంద చర్య..

విశాఖ ఎయిర్‌పోర్టులో ఏపీ ప్రతిపక్ష నేత, వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. హైదరాబాద్‌కు బయలుదేరడానికి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకోగా అక్కడే ఓ హోటల్లో పనిచేసే శ్రీనివాసరావు అనే దుండగుడు కత్తితో దాడిచేసి హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిని పలువురు నాయకులు పార్టీలకతీతంగా ఇప్పటికే ఖండించారు. 
 
తాజాగా నిజామాబాద్ ఎంపీ కవిత జగన్‌పై దాడిని తీవ్రంగా ఖండించారు. ట్విట్టర్లో జగన్‌పై దాడిపట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ఈ దాడిని ఓ పిరికిపంద చర్యగా ఆమె అభివర్ణించారు. ఇలాంటి హింసా సంస్కృతిని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తానని కవిత ట్వీట్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బలోపేతమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇలాంటి ఘటనలు దేశ సమగ్రతను నాశనం చేస్తాయని కవిత ఆందోళన వ్యక్తం చేశారు.
 
అలాగే వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. విశాఖ విమానాశ్రయంలో దాడిపై ట్వీట్టర్‌ ద్వారా తన సందేశాన్ని ఉంచారు. ''వైఎస్ జగన్ గారిపై జరిగిన దాడిని ఖండిస్తున్నాను. బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు. జగన్ గారు త్వరగా కోలుకొవాలని కోరుకుంటున్నాను" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.