శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 9 మార్చి 2021 (07:58 IST)

బాకీ సొమ్ము అడిగిందనీ పెట్రో బాంబుతో దాడి చేసిన పశువుల వ్యాపారి

తెలంగాణ రాష్ట్రంలో మహిళా దినోత్సవం రోజున ఓ మహిళపై పెట్రోల్ బాంబు దాడి జరిగింది. తనకు చెల్లించాల్సిన బాకీ సొమ్ము అడిగినందుకు ఓ పశువుల వ్యాపారి ఈ దారుణానికి ఒడిగట్టాడు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మెదక్‌ జిల్లా టేక్మాల్‌ మండలం మల్కాపూర్‌ తండాకు చెందిన సక్రిబాయి(42) అనే మహిళ భర్త గతంలో బంధువులతో జరిగిన గొడవల్లో హత్యకు గురయ్యాడు. అప్పటి నుంచి ఆమె పుట్టింట్లోనే ఉంటూ వస్తోంది. తన ఇద్దరు పిల్లల్లో ఒకరికి పెళ్లయింది.
 
ఈ క్రమంలో ఆదివారం జోగిపేట సంతకని ఇంట్లోంచి వెళ్లిన ఆమె రాత్రయినా తిరిగిరాలేదు. బాకీ డబ్బులు అడిగిన పాపానికి ఓ పశువుల వ్యాపారి ఆమెపై పెట్రోల్ బాంబుతో దాడిచేశాడు. ఈ దాడి తర్వాత గ్రామంలోకి చేరుకుందామని ప్రయత్నించినా కాలిన గాయాలతో నడవలేక గాంధీ, అంబేడ్కర్‌ విగ్రహాల సాక్షిగా వాటి సమీపంలోనే ఆమె కుప్పకూలిపోయింది. 
 
మరుసటిరోజు అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్‌ గ్రామ శివారులో కాలిన గాయాలతో పడి ఉన్నట్టు సోమవారం ఉదయం తెలిసి.. కుటుంబ సభ్యులు అక్కడకు పరిగెత్తారు. అప్పటికే ఒళ్లంతా తీవ్రంగా కలిపోయి ఆమె పరిస్థితి దారుణంగా ఉంది. 
 
సంత నుంచి వచ్చేటపుడు గడిపెద్దాపూర్‌ గ్రామానికి చెందిన పశువుల వ్యాపారి సాదత్‌ పెట్రోలు పోసి నిప్పంటించాడని చెబుతూనే ఆమె అపస్మారక స్థితికి చేరుకున్నారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. సక్రిబాయికి సాదత్‌ డబ్బులు ఇవ్వాల్సి ఉందని.. అవి అడగానికి వెళ్తే ఇలా దాడి చేశాడని.. ఎస్పీ చందనాదీప్తి వెల్లడించారు.