1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 మార్చి 2021 (19:24 IST)

రాజుగారు నాపై చేయి చేసుకోలేదు : టీడీపీ కార్యకర్త

విజయనగరంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం సందర్భంగా టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఓ మహిళపై చేయిచేసుకున్నారంటూ ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కానీ సాక్షాత్తు అశోక్ గజపతిరాజుతో చెంపదెబ్బ తిన్నట్టుగా ప్రచారం జరిగిన టీడీపీ మహిళా కార్యకర్త చెప్పిన విషయం వేరేలా వుంది.
 
ప్రచారం సందర్భంగా తాను హారతి పళ్లెం పట్టుకుని నడుస్తున్నానని తెలిపింది. అయితే, ప్రచారంలో భాగంగా చల్లిన పువ్వులు హారతి పళ్లెంపై పడి మంటలు చెలరేగాయని, దాంతో అశోక్ గజపతిరాజు వెంటనే స్పందించి మంటలు ఆర్పివేశారని ఆ మహిళ వెల్లడించింది. అశోక్ గజపతిరాజు సకాలంలో స్పందించకపోయుంటే తన చీరకు మంటలు అంటుకునేవని తెలిపింది.
 
అంతకుముందు.. విజయనగరంలో మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఓ సంఘటనలో ఆయన ఓ మహిళపై చేయిచేసుకున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. 
 
దీనిపై మాన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ సంచయిత గజపతి స్పందించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే తీరు ఇదేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుష అహంకార భావజాలంతో ఉన్న ఒక మహిళా ద్వేషి నుంచి ఇంతకన్నా ఎక్కువ ఆశించలేం అని విమర్శించారు. 
 
అశోక్ గజపతిరాజు రామతీర్థం ఆలయానికి గౌరవ చైర్మన్‌గా ఉన్నారని, ఇప్పుడాయన తన అసలు రంగు బయటపెడుతున్నాడని సంచయిత వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఈ ఘటన తాలూకు వీడియోను కూడా సంచయిత పంచుకున్నారు.