1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 మార్చి 2021 (11:31 IST)

నిలోఫర్ ఆస్పత్రిలో వింత శిశువు.. జన్యుపరమైన లోపంతో..?

హైదరాబాద్‌‌లో ఇటీవల చేప ఆకారంలో శిశువు జన్మించిన సంగతి తెలిసిందే. హైకోర్టు సమీపంలోని పేట్ల బురుజు ఆస్పత్రిలో అచ్చం చేపలా శరీరం ఉన్న బిడ్డ పుట్టింది. కానీ ఈ శిశువు కూడా రెండు గంటలకే మృతి చెందింది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రిలో వింత శిశువు జన్మించింది. హైదరాబాద్ కాప్రాకి చెందిన సరళ, విజయ్ కుమార్ దంపతులకు ఈ శిశువు జన్మించింది. 
 
హెర్లేక్వీన్ ఇచియోసీస్ అనే జన్యుపరమైన లోపంతో ఈ శిశువు జన్మించినట్లు డాక్టర్లు తెలిపారు. నిలోఫర్ ఆసుపత్రిలోని రెండవ అంతస్తులో చికిత్స పొందుతున్న ఈ శిశువు పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. గతంలోనూ సరళ నిలోఫర్‌లోనే వింత శిశువుకు జన్మించినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. జన్యులోపం కారణంగా చర్మం పగిలిపోయి, రక్తపు చారలతో ఆ శిశువు జన్మించింది. సదరు మహిళకు గతంలో జన్మించిన బిడ్డ కూడా ఇదే జన్యులోపంతో జన్మించి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.., మేడ్చల్‌ జిల్లా, కాప్రా ప్రాంతానికి చెందిన సరళ, విజయ్‌ కుమార్‌ దంపతులకు మొదట ఒక బిడ్డ జన్మించి జన్యు లోపంతో మరణించింది. ఆ సమయంలో వారికి జన్యు పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. కాని, సదరు దంపతులు జన్యు పరీక్షలు చేయించుకోకుండానే రెండో గర్భానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో శనివారం సరళ రెండోసారి నిలోఫర్‌ హాస్పిటల్‌లో ప్రసవించింది.
 
ఈ కాన్పులో రక్తపు చారలతో 'హర్లిక్విన్‌ ఇథియోసిస్‌’ సిండ్రోమ్‌తో శిశువు జన్మించింది. శిశువు జన్మించిన వెంటనే శరీరంపై చర్మం పగిలిపోయి రక్తం, మాంసం బయటకు తేలడం, రక్తపు చారలు కనిపించాయి. దీంతో వెంటనే శిశువును తదుపరి చికిత్స నిమిత్తం ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు.