1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఇకపై ఓపెన్ ఎగ్జామ్ సిస్టమ్...

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు ఇది నిజంగానే శుభవార్త. ఇకపై పరీక్షలను పుస్తకాలు చూసే రాయొచ్చు. దీన్నే ఓపెన్ బుక్ పరీక్షల విధానం అంటారు. ఇప్పటివరకు చ‌ర్చ‌ల వ‌ర‌కే ఉన్న ఈ ప్ర‌తిపాద‌న ఈ సంవ‌త్స‌రం నుంచి కార్య‌రూపం దాల్చుతుంది. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కోర్సుల్లో ఈ విద్యా సంవ‌త్స‌రం (2021-22) నుంచే అమ‌లు చేయ‌నున్నారు. ఈ మేర‌కు రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్ష‌ణ మండ‌లి(ఎస్‌బీటెట్‌) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 
 
ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా ఆన్‌లైన్ తరగతులు జరుగుతున్నాయి. మరికొన్ని వర్శిటీలు విద్యార్ధులకు స్టడీ మెటీరియల్ అందించి పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మధ్యన కొన్ని యూనివర్శిటీలో ఓపెన్ బుక్ పరీక్ష విధానాన్ని అమలు చేశాయి. 
 
తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ఈ విద్యా సంవత్సరం దీనిని అమలు చేయనున్నారు. ఈ ఓపెన్ బుక్ ప‌రీక్ష‌ల విధానంలో స‌బ్జెక్టుపై ప‌ట్టు ఉంటేనే ప‌రీక్ష‌లు బాగా రాయ‌గ‌లుగుతారు. సబ్జెక్టుపై పట్టు లేకపోతే మనకు ఇచ్చిన ప్రశ్నాపత్రంలో ప్రశ్న చూసి బుక్‌లో దాని సమాధానం కోసం వెతకడం అనేది చాలా టైమ్ తీసుకుంటుంది. 
 
ఇక సబ్జెక్టుపై పట్టు ఉంటే మాత్రం ఓపెన్‌ బుక్‌ పరీక్షల విధానంలో పరీక్షలు బాగా రాయగలుగుతారు. కొత్త విధానాన్ని అమలు చేయాలంటే ప్రశ్నపత్రాలు, బోధన తీరు కూడా మారాల్సి ఉంటుంది. ప్రశ్నలు ఎలా వచ్చినా జవాబులు రాసేలా విద్యార్థులను సంసిద్ధులను చేయాలి. కరోనా నేపథ్యంలో ఈ విధానంపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. 
 
ఏఐసీటీఈ, యూజీసీ సైతం పరీక్షలను ఓపెన్‌ బుక్‌ విధానంలో పెట్టుకోవచ్చని, అది ఆయా వర్సిటీల ఇష్టమని స్పష్టం చేశాయి. అయితే.. ఈ విధానం అనేది అన్ని సబ్జెక్టులకు ఉండకపోవచ్చని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ తెలిపింది. యేటా సుమారు తెలంగాణలో 54 ప్రభుత్వ, 77 ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 25 వేల మంది చేరుతున్నారు. 2021-22 విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్‌ (సీ21)తో పాటు ఓపెన్‌ బుక్‌ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ నిర్ణయించింది.