శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 జూన్ 2023 (22:05 IST)

కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ట్రాజెడీ... 19 రైళ్లను రద్దు చేసిన ద.మ.రైల్వే

train
ఒడిశాలోని బాలేశ్వర్‌లో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు దుర్ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. భారతీయ రైల్వే చరిత్రలో ఇదే అతిపెద్ద రైలు ప్రమాదంగా భావిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన మార్గంలో దెబ్బతిన్న ట్రాక్‌ను పునరుద్ధరించి, ఆదివారం రాత్రి నుంచి రాకపోకలను పునరుద్ధరిస్తున్నారు. యుద్ధప్రాతిపదికన ట్రాక్‌ పునరుద్ధరణ పనులు పూర్తి చేసిన అధికారులు ప్రస్తుతం పరిమితంగా రైళ్లను నడుపుతున్నారు. 
 
ఈ  నేపథ్యంలో సోమ, మంగళ, బుధ, శుక్రవారాల్లో పలు రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. షాలిమార్‌ నుంచి ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌కు వెళ్లాల్సిన (12841) రైలును సోమ, మంగళవారాల్లో రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ నెల 5న సంత్రగచ్చి-తాంబరం రైలు(22841)తో పాటు హౌరా - చెన్నై (12839), ఎర్నాకుళం - హౌరా (22878) రైళ్లను రద్దు చేశారు. 
 
అదేవిధంగా, ఈ నెల 6న హౌరా - సికింద్రాబాద్‌ (12703), షాలిమార్‌ - ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ (18045), హౌరా - ఎస్‌ఎంవీటీ బెంగళూరు (22887), సంత్రగచ్చి - ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ (22807), ఎంజీఆర్‌ సెంట్రల్‌ చెన్నై - హౌరా (12840), విల్లుపురం - ఖరగ్‌పూర్‌(2204), హైదరాబాద్‌ దక్కన్‌- షాలిమార్‌ (18046), షాలిమార్‌ - తిరువనంతపురం (22642), గౌహతి - ఎస్‌ఎంవీటీ బెంగళూరు (12510), అగర్తలా - ఎస్‌ఎంవీఈ బెంగళూరు (12504), సికింద్రాబాద్‌ - షాలిమార్‌ (12774), సికింద్రాబాద్‌ - హౌరా (12704) రైళ్లను రద్దు చేసినట్టు రైల్వేఅధికారులు తెలిపారు. ఈ నెల 7 తేదీన  షాలిమార్‌ - సికింద్రాబాద్‌ (22849) రైలు, 9న సికింద్రాబాద్‌ - షాలిమార్‌(22850) రైళ్ల సర్వీసులను రద్దు చేశారు.