1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 జూన్ 2023 (23:14 IST)

ఆగివున్న గూడ్సును ఢీకొన్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ - 50 మంది మృతి!?

train accident
ఒరిస్సా రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పట్టాలపై ఆగివున్న గూడ్సు రైలును కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడు బోగీలు పల్టీలు కొట్టాయి. దీంతో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన్నట్టు తెలిపారు. 300 మందికిపై గాయాపడినట్టు సమాచారం. ఒరిస్సా రాష్ట్రంలని బాలాసోర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలు తెలియాల్సివుంది. ఇందుకోసం ఏపీలో ప్రధాన స్టేషన్లలో రైల్వేశాఖ ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నంబర్లు ఏర్పాటు చేసింది. 
 
విశాఖలో హెల్ప్‌లైన్‌ నంబర్లు: 08912746330, 08912744619, విజయనగరం: 08922-221202, 08922-221206, విజయవాడ: 0866 2576924, రాజమహేంద్రవరం: 08832420541 అనే నంబర్లలో సంప్రదించవచ్చు. 
 
ఇదిలావుంటే, ఈ రైలు ప్రమాదం దృష్ట్యా ఆ మార్గంలో ప్రయాణించే పలు రైళ్లను దారి మళ్లించారు. చెన్నై సెంట్రల్‌ - హౌరా రైలు జరోలీ మీదుగా, వాస్కోడిగామ - షాలిమర్‌ రైలు కటక్‌, సలగోన్‌, అంగుల్‌ మీదుగా మళ్లించారు. సికింద్రాబాద్‌ - షాలిమార్‌ వీక్లీ రైలు కటక్‌, సలగోన్‌, అంగుల్‌ మీదుగా మళ్లించినట్టు రైల్వే అధికారులు వెల్లడించారు.
 
అలాగే, ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లా బహనాగ రైల్వేస్టేషన్‌ సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి వివరించారు. 
 
రైలు ప్రమాదం దురదృష్టకరమైన ఘటన అని ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయ్‌ అన్నారు. రైలు ప్రమాద ఘటనపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్న ఆయన.. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. శనివారం ఉదయం ఘటనాస్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షించనున్నట్టు చెప్పారు. 
 
కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదానికి గురికావడంపై బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తమ రాష్ట్రం నుంచి ప్రయాణికులతో వెళ్తున్న రైలు బాలేశ్వర్‌ వద్ద శుక్రవారం గూడ్సు రైలును ఢీకొట్టిందని తెలిపారు. తమ రాష్ట్రానికి చెందిన వారి క్షేమం కోసం ఒడిశా ప్రభుత్వం, సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వేతో సమన్వయం చేస్తున్నట్టు తెలిపారు.