శనివారం, 28 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 26 ఆగస్టు 2020 (06:12 IST)

వ్యవసాయానుబంధ పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలకు సమ న్యాయం అందించే దిశగా సిఎం కెసిఆర్ పని చేస్తున్నారని, ఆడుగంటతున్న కులవృత్తులను పునరుద్ధరించి, ఆయా కులాల వర్గాల వారందరికీ పని కల్పిస్తున్నారని, తద్వారా అందరి బాగోగులు చూస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

పాలకుర్తి చెరువులో చేప విత్తనాలను వేసిన మంత్రి  మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో చేపలు పట్టడానికి కూడా పక్క రాష్ట్రాల నుంచి మన చెరువుల్లోకి వచ్చేవారన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సిఎం కెసిఆర్ ఈ పరిస్థితుల నుంచి మార్పును తెస్తూ, మన జాలర్లకే చేప విత్తనాలు చెరువుల్లో ఉచితంగా వేస్తూ, వారికి చేతినిండా పని కల్పిస్తున్నారన్నారు.

అలాగే ఇతర కులాల వారికి కూడా పని కల్పన జరుగుతున్నదన్నారు. నేతన్నలకు నూలు, గొర్రెలు, బర్రెల పంపిణీ వంటి అనేక ఉదాహరణలున్నాయని మంత్రి అన్నారు. అడుగంటుతున్న కుల వృత్తులకు సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలోనే మళ్ళీ ఆదరణ ప్రారంభమైందన్నారు. ఇతరత్రా అన్ని కులాలను ఆదుకునే విధంగా సిఎం కెసిఆర్ అనేక పథకాలను రచిస్తున్నారన్నారు.

మరోవైపు వ్యవసాయనుబంధ పరిశ్రమలకు ఆదరణను పెంచి, ఆయా పరిశ్రామిక శిక్షణను కూడా ఇస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజలు ప్రభుత్వం కల్పిస్తున్న ఆర్థిక సాయాలను, పథకాలను వినియోగించుకుని అభివృద్ధి సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నిఖిల, వివిధ శాఖల అధికారులు, మత్స్య కార్మికుల సంఘాల ప్రతినిధులు, మత్స్య కారులు తదితరులు పాల్గొన్నారు.