గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : గురువారం, 18 మే 2023 (14:13 IST)

నిద్రిస్తున్న భార్య తలకు కరెంట్ వైర్ చుట్టి విద్యుత్ షాక్‌తో చంపేసిన భర్త

electrocutes
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో దారుణం జరిగింది. నిద్రిస్తున్న భార్యను కిరాతక భర్త కరెంట్ షాక్‌తో చంపేశాడు. డబ్బుల కోసం వేధించడంతో భర్తతో భార్య గొడవపడి, చేయి చేసుకుంది. దీంతో ఆమె నిద్రిస్తున్న సమయంలో తలకు విద్యుత్ వైరు చుట్టి స్విచా‌న్ చేసి చంపేశాడు. ఆ తర్వాత ప్రమాదవశాత్తు చనిపోయిందని అందర్నీ నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు పసిగట్టడంతో అసలు విషయం వెలుగుచూసింది. 
 
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లోని కొందుర్గ్‌కు చెందిన యాదయ్య అనే వ్యక్తి గత 2008లో మమత అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆటో డ్రైవరుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చిన యాదయ్య - మమత దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పిల్లలు పుట్టిన తర్వాత యాదయ్య మద్యానికి బానిసయ్యాడు. దీంతో మమత కుటుంబ పోషణ నిమిత్తం దినకూలీగా మారింది. అయితే, యాదయ్య తాగివచ్చి డబ్బుల కోసం భార్యాపిల్లలను నిత్యం వేధించసాగాడు.
 
సోమవారం రాత్రి కూడా ఇదే విషయంపై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కోపంతో భర్తపై మమత చేయిచేసుకుంది. తర్వాత పిల్లలతో కలిసి నిద్రపోయింది. మంగళవారం తెల్లవారుజామున గాఢనిద్రలో ఉన్న మమత తలకు యాదయ్య కరెంట్ వైరు చుట్టి స్విచాన్ చేశాడు. దీంతో షాక్ తగిలిన మమత చనిపోయింది. 
 
ఆ తర్వాత తన భార్య ప్రమాదవశాత్తు చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు అనుమానించి యాదయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెల్లడైంది. దీంతో కేసు నమోదు చేసి యాదయ్యను అరెస్టు చేశారు. తల్లి మృతి చెందడం, తండ్రి జైలుపాలుకావడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.