శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (14:31 IST)

నవ్య రెడ్డి హత్య కేసు.. భర్తే కిరాతకుడు.. ట్యాబ్లెట్లు ఇచ్చి చున్నితో ఉరివేసి..?

నవ వధువు నవ్య రెడ్డి మిస్సింగ్, హత్య కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం మండలం అయ్యవారిగూడెంలో రెండు రోజుల క్రితం నవ్య రెడ్డి మిస్సైంది. ఆపై హత్యకు గురైంది. ఈ కేసులో భార్యను భర్త శేషు రెడ్డి కడతేర్చినట్లు పోలీసుల విచారణలో తేలింది.
 
వివరాల్లోకి వెళితే.. ఎర్రుపాలెం మండలం అయ్యవారిగూడెంకు చెందిన ఎర్రమల నవ్య రెడ్డి(22)ని ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్త లంక పల్లి గ్రామ శివార్లలోని కుక్కల గుట్ట వద్ద ఆమె భర్త నాగ శేషు రెడ్డి.. చున్నీతో ఉరివేసి నవ్యను హత్య చేశాడు. అయితే రెండు రోజుల క్రితం ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్‌లో నాగ శేషు రెడ్డి.. తన భార్య కనిపించడంలేదంటూ ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
ఈ క్రమంలో భర్త నాగ శేషు రెడ్డి కదలికలపై అనుమానం వచ్చిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల గ్రామంలోని సీసీ కెమెరాలో నమోదు అయిన దృశ్యాల ఆధారంగా నాగ శేషు రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.
 
బుధవారం రాత్రి.. నవ్య రెడ్డిని బైక్ పై తీసుకు వచ్చి కుక్కల గుట్ట వద్ద మత్తు టాబ్లెట్‌లు ఇచ్చి అనంతరం చున్నితో ఉరివేసి హత్య చేసినట్టు విచారణలో తేలింది. ఆ తరువాత హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతురాలి సెల్ ఫోన్ నుండి ఆమె తండ్రికి మెసేజ్ చేసాడు నిందితుడు శేషు రెడ్డి.
 
ఇంజినీరింగ్‌లో బ్యాక్ లాక్‌లు ఉన్నాయని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మృతురాలి సెల్ ఫోన్ నుండి మెసేజ్‌లు పంపించాడు నిందితుడు. ఆ తరువాత ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్‌ లో తన భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు.
 
నిందితుడు నాగ శేషు రెడ్డి పుణేలో ఉద్యోగం చేస్తున్నాడు. మృతురాలి స్వయానా మేన మామ కొడుకే నాగ శేషు రెడ్డి. రెండు నెలల క్రితమే వీరికి వివాహం జరిగింది. మృతురాలు సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలోని సాయి స్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది.