1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 ఫిబ్రవరి 2021 (12:41 IST)

నన్ను జైలుకు పంపిస్తావా..? మహిళపై గొడ్డలితో దాడి చేశాడు.. జస్ట్ మిస్ లేకుంటే?

జైలుకు పంపిందనే కక్షతో మహిళపై ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. తాజాగా ఈ కేసుకు సంబంధించిన నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 
 
వివరాల్లోకి వెళితే.. సూర్యాపేటకు చెందిన రవికుమార్‌ దంపతులు గుర్రంగూడలోని టీచర్స్‌ కాలనీకి రెండేళ్ల క్రితం వచ్చి నివసిస్తున్నారు. రవికుమార్‌ ప్రయివేటు ఉద్యోగం చేస్తున్నాడు. భార్య ఇంట్లోనే ఉంటుంది. వీరికి అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన రాహుల్‌గౌడ్‌(25)తో పరిచయం ఉంది. ఈ క్రమంలోనే రాహుల్‌ వీరి ఇంటికి వెళ్లివస్తుండేవాడు. దీనిని ఆసరాగా తీసుకుని రవికుమార్‌ భార్యను వేధింపులకు గురిచేసేవాడు. దీంతో ఆమె తన భర్త సహకారంతో ఏడాది క్రితం మీర్‌పేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
పోలీసులు అతనిపై 354డీ నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో అతను కొన్నాళ్లు జైల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి బాధిత మహిళ తన పక్కింటివారితో మాట్లాడుతోంది. ఇంతలో అక్కడకు చేరుకున్న రాహుల్‌ కోపంగా గొడ్డలితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ముందుగా ఆమె మెడపై వేటు వేయడానికి ప్రయత్నించాడు. 
 
వెంటనే తన మెడను పక్కకు తిప్పడంతో ఆ గొడ్డలి వేటు కుడి భుజం, మోచేతిపై పడింది. వెంటనే ఇరుగు పొరుగు వారు అక్కడకు చేరుకుని రాహుల్‌ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా అతను పారిపోయాడు. ఈ దృశ్యాలన్నీ సిసిటివిలో రికార్డయ్యాయి. వెంటనే క్షతగాత్రురాలిని ఆస్పత్రికి తరలించారు. 
 
అనంతరం అమీర్‌పేట ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌రెడ్డి తన సిబ్బందితో అక్కడకు చేరుకుని పరిశీలించారు. గతంలో నిర్భయ కేసులో తనను జైల్లో పెట్టించినందుకే కక్షతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు ఏసీపీ స్పష్టం చేశారు. పీడీయాక్ట్‌ కింద కేసు నమోదు చేస్తామని ఏసీపీ వెల్లడించారు.