1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (08:06 IST)

తొడపై సూసైడ్ లేఖ రాసి.. పబ్లిక్ టాయి‌లెట్‌లో మహిళ ఆత్మహత్య

ఓ శాడిస్ట్ భర్త వేధింపులు భరించలేని ఓ భార్య.. సులభ్ కాంప్లెక్స్ (మరుగుదొడ్డి)లో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ముంబై నగరంలో వెలుగులోకి వచ్చింది. పైగా, ఆమె చనిపోతూ.. తన భర్త నిజ స్వరూపాన్ని తెలుపుతూ తన తొడపైనే సూసైడ్ లేఖ రాసింది. ఈ మహిళ సూసైడ్ లేఖ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబై నగరంలోని ములంద్‌కు చెందిన భాగ్యశ్రీ నర్లేకు ఏడేళ్ల క్రితం సతారా అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. 
 
కొంతకాలం తర్వాత సతారా భార్యను వేధించసాగాడు. ప్రారంభంలో సర్దుకుపోయిన భాగ్యశ్రీకి రోజురోజుకు వేధింపులు ఎక్కువ కావడంతో పుట్టింటికి వెళ్లి తండ్రితో కలిసి ఉంటుంది. ఆమెతో కుమారుడిని కూడా పంపకుండా భర్త మరింతగా వేధించసాగాడు. ఆమె పుట్టింటికి వెళ్లినా అతడు ఫోన్ చేసి, మెస్సేజ్‌లు చేసి నిత్యం అసభ్యపదజాలంతో మానసికంగా వేధించాడు.
 
భర్తను వదిలేసినా తనను ప్రశాంతంగా ఉండనివడం లేదని, తను చేసే ప్రతి పనికి అడ్డుతగులుతున్నాడని భాగ్యశ్రీ ఆవేదనకు లోనైంది. మరోవైపు నిన్ను, నీ కుటుంబాన్ని చంపుతానని భర్త బెదిరింపులు ఎక్కువ కావడంతో తీవ్ర మనస్థాపం చెందిన భాగ్యశ్రీ నర్లే.. జనవరి 28న ఇంటి నుంచి బయటకు వెళ్లి స్థానికంగా ఉన్న పబ్లిక్ టాయిలెట్‌లో చున్నీతో ఉరి వేసుకోని ఆత్మహత్యకు పాల్పడింది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ ఆమె తొడపై రాసిన సూసైడ్ నోట్ కనిపించింది. దానిలో ఆమె భర్త ఎలా వేధింపులకు పాల్పడ్డాడో రాసుకుంది. భర్తను కఠినంగా శిక్షించాలని కోరింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా భార్య చనిపోయిన విషయం తెలుసుకున్న భర్త ఇల్లు వదిలి పరారీ అయ్యాడు.