గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (14:18 IST)

అధికారుల మాటను నమ్ముతా.. తేడా వస్తే తాట తీస్తా : నిమ్మగడ్డ వార్నింగ్

గుంటూరు జిల్లాలో పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారులకు గట్టి హెచ్చరిక చేశారు. తాను అధికారుల మాట విశ్వసిస్తానని, కానీ తేడా వస్తే మాత్రం తప్పక చర్యలు తీసుకుంటానన్నారు.
 
పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా, గుంటూరు కలెక్టరేట్‌కు వచ్చిన ఆయన జిల్లా అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రజలంతా ఓటుహక్కు వినియోగించుకొనేలా ఉపయుక్తమైన వాతావరణం కల్పిస్తాం. మమ్మల్ని విశ్వసించండి. గతంలో ఒకటి, రెండు తప్పులు జరిగినా వాటిని సరిదిద్దుకొంటామని ఇక్కడి అధికారులు చెప్పారు. 
 
ఆఫీసర్లు చెప్పిన వాటిని నేను విశ్వసిస్తాను. కాని చూస్తాను. ఎక్కడైనా తేడాలు వస్తే తప్పక చర్య తీసుకొంటానని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ స్పష్టం చేశారు. గతంలో 90 శాతం ఓటింగ్‌ ఇక్కడ జరిగిందని, ఈ దఫా ఏమాత్రం తగ్గకుండా చూడాల్సిందిగా ఆదేశాలు ఇచ్చామన్నారు. 
 
గత ఎన్నికల సందర్భంగా జరిగిన అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత ప్రాంతాల్లో మరింత పటిష్టంగా చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో జరిగిన అవాంఛనీయ సంఘటనలు అడ్డుకోవడంలో విఫలమైన అధికారులపై చర్యలు తీసుకోవడం జరిగిందని, ఉదాశీనంగా ఉండే అధికారులపై భవిష్యత్తులో చర్యలుంటాయని హెచ్చరించారు.
 
అదేసమయంలో జిల్లాలో కొత్తగా సమస్యాత్మక గ్రామాలను గుర్తించడం జరిగింది. నేను పోలింగ్‌ సమయంలో మళ్లీ వస్తాను. ఆయా గ్రామాల్లో పర్యటిస్తానని కమిషనర్‌ రమేష్‌కుమార్‌ తెలిపారు. గతంలో ఏకగ్రీవమైన ఎంపీటీసీ, జడ్పీటీసీ, మునిసిపల్‌ వార్డు ఎన్నికల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.