గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 జనవరి 2021 (12:42 IST)

తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు శస్త్రచికిత్స_సీఎం కాళేశ్వరం పర్యటన ముగిశాక..?

Koppula Eshwar
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు శస్త్ర చికిత్స జరిగింది. కొంత కాలంగా పొట్ట ఎడమ భాగంలో కణతితో బాధపడుతున్న ఆయనకు మంగళవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖవనిలో ఓప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్యులు శస్త్రచికిత్స చేసి 3 సెంటీమీటర్ల కణతిని తొలగించారు. 
 
‘లైపోమా’ను కడుపులో పెరిగే కొవ్వుగడ్డగా వైద్యులు చెబుతున్నారు. సీఎం కేసీఆర్‌కార్యక్రమంలో పాల్గొన్న మంత్రికి కడుపులో నొప్పి వచ్చింది. దీంతో  గోదావరిఖనిలోని ఓప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లారు. వైద్యుడైన రామగుండం మేయర్‌  బంగి అనిల్‌కుమార్‌ కొప్పులకు శస్త్రచేకిత్స చేశారు.
 
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌‌కు కడుపులో ఎడమ భాగంలో కణితి ఏర్పడింది. ఆపరేషన్ చేసి దాన్ని తొలగించాలని డాక్టర్లు ఇదివరకే ఆయనకు సూచించారు. కానీ ఆయన సర్జరీ చేయించుకోవడం కుదర్లేదు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటన సందర్భంగా.. మంత్రి ఈశ్వర్ ఆయనకు స్వాగతం పలికారు. సీఎం పర్యటన ముగిశాక తిరిగి వస్తుండగా.. మంత్రికి కడుపులో నొప్పి ఎక్కువైంది.
 
మంత్రితోపాటు కారులో ప్రయాణిస్తున్న మేయర్ డాక్టర్ అనిల్‌కుమార్‌.. ఆయన్ను స్వయంగా గోదావరిఖనిలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించి వెంటనే సర్జరీ చేసి 3 సెంటీమీటర్ల పొడవైన కణతిని తొలగించారు. 
 
ఆపరేషన్‌ జరిగినంత సేపు ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ హాస్పిటల్‌లోనే ఉన్నారు. ఆపరేషన్‌ పూర్తయిన అరగంట తర్వాత మంత్రి కొప్పుల హాస్పిటల్ నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఆయన షెడ్యూల్ ప్రకారమే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం.