బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 సెప్టెంబరు 2020 (14:28 IST)

దటీజ్ మంత్రి తలసాని... విపక్ష నేతను వెంటబెట్టుకుని...

తెలంగాణా రాష్ట్రంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క విసిరిన సవాల్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వీకరించారు. ఆ తర్వాత గురువారం నేరుగా భట్టి విక్రమార్క ఇంటికి మంత్రి వెళ్ళారు. అక్కడ నుంచి భట్టిని వెంటబెట్టుకుని హైదరాబాద్ నగరంలో ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించారో స్వయంగా మంత్రి దగ్గరుండి విపక్షనేతకు చూపించారు. దీంతో భట్టి విక్రమార్క ఖంగుతిన్నారు. ఈ ఆసక్తికర పరిణామానికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్‌ నగరంలో లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం అంటూ ప్రభుత్వం అసత్య వ్యాఖ్యలు చేస్తోందని, అవి ఎక్కడ కట్టారో తమకు చూపించాలని తెలంగాణ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క బుధవారం సవాల్ విసిరారు. దానికి రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అంగీకరించి, ఆ సవాలును స్వీకరించారు. ఈ నేపథ్యంలో గురువారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అధికారులతో కలిసి తలసాని ఈ రోజు ఉదయం భట్టి విక్రమార్క ఇంటికి చేరుకున్నారు. 
 
మంత్రి వస్తారని ఊహించని భట్టి విక్రమార్క... ఒకింత షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత ఆయన తేరుకుని మంత్రి తలసానిని ఇంట్లోకి ఆహ్వానించారు. పిమ్మట.. వారిద్దరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత నగరంలో తమ సర్కారు నిర్మించిన ఇళ్లను చూపిస్తామని తమతో రావాలని ఆయన కోరారు. మంత్రి విజ్ఞప్తికి భట్టి విక్రమార్క అంగీకరించారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి ఒకే కారులో హైదరాబాద్ నగరంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ గృహాలను చూసేందుకు వెళ్లారు.