శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : బుధవారం, 9 నవంబరు 2022 (09:48 IST)

తెలంగాణాకు వందే భారత్ రైలును కేటాయించిన కేంద్రం

Bharat Express
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ రైళ్ళలో ఒకదాన్ని తెలంగాణ రాష్ట్రానికి కేటాయించింది. ఇది దేశంలో నడుపనున్న ఆరో రైలు కావడం గమనార్హం. అయితే, ఈ రైలును ఏ మార్గంలో నడపాలన్న అంశంపై అధికారులు ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. 
 
అత్యాధునిక సాంకేతికత, అంత్యత వేగంగా ప్రయాణించే ఈ రైలును సికింద్రాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించినట్టు రైల్వే బోర్డు తెలిపింది. ఈ రైలు గరిష్టంగా 180 కిలోటర్ల వేగంతో దూసుకెళ్లనుంది. 
 
అయితే, ఈ రైలులో బెర్తులు ఉండవు. సీటింగ్ మాత్రమే ఉంటుంది. దీంతో ఉదయం పూట బయలుదేరి, సాయంత్రానికి గమ్యస్థానం చేరుకునేలా ఈ రైలు ఉంటుంది. అందుకు అనువుగా ఉండే రూటును ఖరారు చేయనున్నారు. 
 
ప్రస్తుతానికి ఈ రైలును నడిపే మార్గాన్ని ఇంకా ఖరారు చేయలేదు. అయితే, సికింద్రాబాద్ నుంచి తిరుపతి లేదా బెంగుళూరు లేదా విశాఖపట్టణం లేదా ముంబై మార్గాలలో నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. ఖచ్చితంగా ప్రయాణకుల డిమాండ్ ఉన్న ప్రాంతాల మధ్యే ఈ రైలును నడుపనున్నారు. 
 
మరోవైపు చెన్నై నుంచి బెంగుళూరు మీదుగా మైసూరు వరకు వందే భారత్ రైలు నడుపనున్నారు. ఇది రేపటి నుంచి పట్టాలెక్కనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణాకు కేటాయించిన ఆరో మెట్రో రైల్ ట్రాఫిక్, ప్రయాణికుల డిమాండ్ వంటివాటిపై రైల్వే బోర్డు అధ్యయనం చేస్తున్నట్టు సమాచారం.