1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 ఆగస్టు 2021 (19:08 IST)

టాలీవుడ్ డ్రగ్స్ కేసు .. మంత్రి కేటీఆర్ దగ్గరి వారికి ఈడీ నోటీసులు : రేవంత్ రెడ్డి

తెలుగు చిత్రపరిశ్రమను కుదిపేసిన సంఘటనల్లో టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఒకటి. ఈ కేసులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు దగ్గరివారికి సంబంధాలు ఉన్నాయని, వారికి ఈడీ నోటీసులు కూడా పంపించిందని ఆరోపించారు. అందుకే గత నాలుగు రోజులుగా ఆందోళనలో ఉన్నారని చెప్పుకొచ్చారు. 
 
ఇప్పటికే మంత్రి కేటీఆర్ దగ్గర వారికి కూడా డ్రగ్స్ కేసులో ఈడీ నోటీసులు వచ్చాయని రేవంత్ ఆరోపించారు. అందుకే ప్రభుత్వ పెద్దలు డ్రగ్స్ కేసుపై భయపడుతున్నారని రేవంత్ అన్నారు. డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ చేస్తే ప్రభుత్వ పెద్దలకు ఇబ్బందేంటని ప్రశ్నించారు. అసలు డ్రగ్స్‌ కేసులో కేటీఆర్ పాత్ర ఉందా.. ? రకుల్ పాత్ర ఉందా? అనేది అసలు సమస్యే కాదని రేవంత్ వ్యాఖ్యానించారు.
 
కేటీఆర్‌కు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ దగ్గర వారా అన్న విషయంతో తనకు సంబంధం లేదని రేవంత్ తెలిపారు. డ్రగ్స్‌ కేసుపై ఈడీ త్వరితగతిన విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. గోవాకు కేటీఆర్ ఎందుకు వెళ్లారో దానిపై ఈడీ అధికారులు దర్యాప్తు చేయాలన్నారు. 
 
డ్రగ్స్ అనేది మన దేశానికి కొత్తేమీ కాదని… ఇతర దేశాల్లో మాదక ద్రవ్యం మన దేశానికి వస్తుందన్నారు. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వ అధికారులకు విచారణ అధికారం ఉండదన్నారు. ఇతర దేశాలకు వెళ్లి విచారణ చేయలేరన్నారు. కోర్టుల్లో సర్కారు తామే విచారణ చేశామని… ఎవరికీ వివరాలు ఇవ్వం అంటుందన్నారు. ఈ నేపథ్యంలోనే ఈడీ కేసు నమోదు చేసిందని రేవంత్ చెప్పుకొచ్చారు.