1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 మార్చి 2022 (11:03 IST)

యాసంగి ధాన్యం కొనుగోలుకు కేంద్రంపై సీఎం కేసీఆర్ ఒత్తిడి... ఢిల్లీ టూర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు కేంద్రంపై పోరాటానికి దిగనున్నారు. యాసంగి ధాన్యాన్ని వంద శాతం కొనుగోలు చేయాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇదే అంశంపై రాజకీయ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. అటు పార్లమెంట్‌లో కూడా ఏం చేయాలో ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.
 
ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు, నేలల స్వభావానికి అనుగుణంగా యాసంగిలో వరియేతర పంటల సాగును ప్రోత్సహించే అంశంపై ఎమ్మెల్యేలతో సీఎం చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 4,200 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వానాకాలం ధాన్యాన్ని సేకరించింది. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లను కొనుగోలు చేయబోమని తెగేసి చెప్పింది. దీంతో తెరాస ఎల్పీ సమావేశంలో ఇదే అంశంపై ప్రధాన చర్చనీయాంశంగా మారింది. 
 
అదేసమయంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారు రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని విమర్శలు చేస్తున్నారు. అలాగే, రైతులతో కోటి సంతకాలు సేకరించాలన్న యోచనలో ఉంది. ఇక తెరాస ఎల్పీ సమావేశం తర్వాత మంత్రులు, ఎంపీలతో కలిసి ఆయన సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో కేంద్ర మంత్రులు, అవసరమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సైతం కలుసుకుని యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేయనున్నారు.