1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 జూన్ 2022 (08:29 IST)

ప్రయాణికులకు షాక్ - సెస్ పేరుతో చార్జీలు పెంచిన టీఎస్ఆర్టీసీ

tsrtc
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మరోమారు ప్రయాణికులపై భారం మోపింది. డీజల్ సెస్ పేరుతో భారీగానా వడ్డించింది. అయితే, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం ఈ పెంపును మినహాయించింది. మిగిలిన అన్ని రూట్లలో పెంచేసింది. ఈ పెంపు భారం గురువారం నుంచే అమల్లోకి తెచ్చింది. 
 
ఈ పెంపుతో గత యేడాది కాలంలో ఇప్పటివరకు సగటున రూ.20 మేరకు భారం పడినట్టు అంచనా వేస్తున్నారు. పెరిగిన చార్జీలు గురువారం నుంచి అమల్లోకి రావడంతో ముందుగా రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు అదనపు చార్జీలను చెల్లించాల్సివుంటుంది. డీజల్ ధరల పెరుగుదలతో ఆర్టీసీపై భారం పడటమే ఈ అదనపు సెస్సుకు కారణమని ఆర్టీసీ యాజమాన్యం చెబుతోంది. 
 
చార్జీల భారం ఇలా... 
 
తాజాగా విధించిన సెస్సుతో కిలోమీటర్లు పెరిగే కొద్దీ చార్జీలు పెరుగుతాయి. దూర ప్రాంతాలకు వెళ్లే వారిపై అధికభారం పడుతుంది. కనీస సెస్సును పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస బస్సులో రూ.5 చొప్పున, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులో రూ.10 చొప్పున పెంచేసింది. 
 
* పల్లె వెలుగు సర్వీసుల్లో 250 కిలోమీటర్లకు కనిష్టంగా రూ.5 గరిష్టంగా రూ.45 వరకు పెరిగింది. 
 
* ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 500 కిలోమీటర్ల దూరానికి కనిష్టంగా రూ.5 నుంచి గరిష్టంగా 90 పెరిగింది. 
 
* సూపర్ లగ్జరీ బస్సులో 500 కిలోమీటర్ల దూరానికి కనిష్టంగా రూ.10, గరిష్టంగా 130 చొప్పున పెంచేశారు. ఏసీ బస్సు సర్వీసుల్లో 500 కిమీ వరకు రూ.10 నుంచి రూ.170 వరకు పెంచింది.