1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Senior choreographer Srinu passes away

సీనియర్ కొరియోగ్రాఫర్ శ్రీను మాస్టర్ కన్నుమూత

Senior choreographer
ప్రముఖ డాన్స్ మాస్టర్ హీరాలాల్ శిష్యుడు, 1700 లకు పైగా చిత్రాలకు నృత్యరీతులు సమకూర్చిన శ్రీను మాస్టర్ (82) చెన్నైలోని టి నగర్ నివాసంలో ఆదివారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆదోని వాస్తవ్యుడైన శ్రీను మాస్టర్ తల్లిదండ్రులు లక్ష్మీ దేవమ్మ, నారాయణప్ప. 1956లో బావగారైన హీరాలాల్ మాస్టర్ దగ్గర చేరిన శ్రీను మాస్టర్ తొలుత ఢిల్లీ రవీంద్రభారతిలో ప్రిన్సిపాల్‌గా పనిచేసి గురుసుందర్ ప్రసాద్ వద్ద కథక్ నృత్యం అభ్యసించారు. 
 
ఆ తర్వాత విశ్వంగురు వద్ద కథాకళి సాధన చేశారు. సినిమా నృత్యాలను బావ హీరాలాల్ వద్ద ప్రాక్టీస్ చేశారు. 1969లో నిర్మాత డూండి రూపొందించిన 'నేనంటే నేనే' చిత్రంతో డాన్సు మాస్టర్‌గా శ్రీను అరంగేట్రం చేశారు. తరువాత 'మహాబలుడు, భక్తకన్నప్ప, దొరబాబు, ఎదురులేని మనిషి, యుగపురుషుడు, యుగంధర్' వంటి చిత్రాలకు నృత్య రీతులు సమకూర్చడంతో శ్రీను మాస్టర్ పేరు పరిశ్రమలో మార్మోగింది. 
 
ఏడెనిమిది భారతీయ భాషా చిత్రాలకు ఆయన కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. 'స్వర్ణకమలం, రాధాగోపాలం, శ్రీరామరాజ్యం' చిత్రాలకు గానూ ఆయన బెస్ట్ కొరియోగ్రాఫర్ గా నంది అవార్డులను పొందారు. ఆయనకు భార్య ఉమాదేవి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు విజయ్ శ్రీనివాస్ ఉన్నారు. తనయుడు విజయ్ శ్రీనివాస్‌ దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నారు.
తర్వాతి కథనం
స్టార్ హీరోలతో ఛాన్సులు... డిమాండ్ పేరుతో వసూలు చేస్తున్న పూజా హెగ్డే