1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్

రుషికొండ కేంద్రంగా పాలన - సీఎం క్యాంపు ఆఫీసుగా మిలీనియం టవర్‌!!

విశాఖపట్నంలో రాజధాని... ప్రకటన ఇప్పుడొచ్చినా... దీనికి అవసరమైన కసరత్తు మాత్రం ఎప్పుడో మొదలైంది. సాగర నగరంలో రాజధాని ఆలోచనకు చాలాకాలం క్రితమే బీజం పడిందని తెలుస్తోంది. అందుకు అవసరమైన భూములు, భవంతులకు సంబంధించిన పూర్తి సమాచారం జిల్లా యంత్రాంగం నుంచి ప్రభుత్వానికి ఎప్పుడో చేరింది. అయితే రాజధాని కోసమని చెప్పకుండా ‘బిల్డ్‌ ఏపీ’ పేరుతో కొంత, గృహ నిర్మాణానికి భూముల పేరిట మరికొంత సమాచారం సేకరించారు. 
 
అసెంబ్లీ సమావేశాల చివరిరోజున విశాఖలో కార్య నిర్వాహక రాజధాని పెట్టాలనే ఆలోచన ఉందని సీఎం జగన్‌ చెప్పడం, దానికి తగినట్టుగానే జీఎన్‌ రావు కమిటీ నివేదిక ఉండటంతో అందుబాటులో ఉన్న భవంతులు, భూముల గుర్తింపు ప్రక్రియ మరింత వేగవంతమైంది. ఇప్పటివరకూ ఎక్కడెక్కడ, ఏమేం గుర్తించారన్న దానిపై ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. 
 
విశాఖపట్నం - భీమిలి బీచ్‌రోడ్డులో ఉన్న రుషికొండ ఐటీ పార్కులో గత ప్రభుత్వం నిర్మించిన మిలీనియం టవర్‌ను సీఎం క్యాంపు కార్యాలయంగా ఉపయోగించుకుంటారని చెబుతున్నారు. ఈ భవనాన్ని నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూ.145కోట్లతో నిర్మించారు. పది అంతస్థులతో, అధునాతన సౌకర్యాలతో కూడిన ఈ భవనంలో 2 లక్షల చదరపు అడుగుల నిర్మాణ స్థలం ఉంది. 
 
దీంతోపాటు మరో 1.5 లక్షల చ.అ. పార్కింగ్‌ సదుపాయం ఉంది. ఐటీ సంస్థల కోసం నిర్మించిన ఈ భవనాన్ని విదేశీ ఐటీ కంపెనీ కాండ్యుయెంట్‌కు నాటి సీఎం చంద్రబాబు కేటాయించారు. 2019 ఫిబ్రవరిలో ప్రారంభించిన ఈ కంపెనీలో 1,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇప్పుడు దీన్ని ఖాళీ చేయించి, అందులో సీఎం క్యాంపు కార్యాలయం పెడతారని చెబుతున్నారు. దీన్ని మిలీనియం టవర్‌-1 గా వ్యవహరిస్తున్నారు.