1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. attempted murder on ys jagan in vizag airport

సెల్ఫీ పేరుతో జగన్‌పై హత్యాయత్నం.. కోడిపందెం కత్తితో దాడి..

ys jagan
వైకాపా అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపక్ష నేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. విశాఖపట్టణం ఎయిర్‌పోర్టు లాంజ్‌లో ఈ హత్యాయత్న దాడి జరిగింది.
 
సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చి వైఎస్‌ జగన్‌పై దుండగుడు దాడి చేశాడు. కోడి పందెలకు ఉపయోగించే కత్తితో అతను జగన్‌పై దాడి చేశాడు. దీంతో వైఎస్‌ జగన్‌ భుజానికి గాయమైంది. 
 
దాడి చేసిన వ్యక్తిని ఎయిర్‌పోర్ట్‌లోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న వెయిటర్‌ శ్రీనివాస్‌గా గుర్తించారు. దాడి జరిగిన వెంటనే దుండగుడిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
 
ఈ వ్యక్తి జగన్‍పై దాడి చేయడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా, రాజకీయ కక్షలు ఏమైనా ఉన్నాయా, ఏ పార్టీకి చెందిన వ్యక్తి తదితర అంశాలపై విచారిస్తున్నారు. 

294వ రోజు పాదయాత్ర ముగించుకొని వైఎస్‌ జగన్‌ గురువారం హైదరాబాద్‌ తిరిగి వచ్చేందుకు విశాఖపట్నం విమానాశ్రయం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన వీఐపీ లాంజ్‌లో ఉండగా.. శ్రీనివాస్‌ అనే వెయిటర్‌.. సెల్ఫీ తీసుకుంటానంటూ వైఎస్‌ జగన్‌ వద్దకు వచ్చారు. 
 
అతను వస్తూనే.. వైఎస్‌ జగన్‌పై కోళ్ల పందెలకు ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. ఈ సమయంలో అప్రమత్తంగా ఉన్న వైఎస్‌ జగన్‌ సహాయకులు దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌ భుజానికి కత్తి తగలడంతో గాయమైంది.

కత్తికి విషపూరిత పదార్థం పూసి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఎయిర్‌పోర్టులో ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన వైఎస్‌.జగన్‌ హైదరాబాద్‌ బయలుదేరారు. 
తర్వాతి కథనం
శక్తివంతమైన మహిళల్లో బ్రహ్మిణి ఒకరు: మంచు మనోజ్