1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 మే 2020 (12:10 IST)

లాక్డౌన్ ప్రత్యేక రైళ్లలో రాయితీలు... రైల్వే శాఖ కీలక నిర్ణయం

లాక్డౌన్ వేళ దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి నడుపుతున్న ప్రత్యేక రైళ్లలో ప్రయాణ రాయితీని రైల్వేశాఖ కల్పించింది. నిజానికి ఈ రైళ్ళలో ఎలాంటి ప్రయాణ రాయితీలు ఉండవని తొలుత తేల్చి చెప్పింది. అయితే, కొన్ని సడలింపులు ప్రకటించింది. 
 
మంగళవారం నుంచి పునరుద్ధరించే రైల్వే సర్వీసుల్లో విద్యార్థులు, దివ్యాంగులు, రోగులకు ఊరటను ఇస్తూ, వారికి రాయితీతో కూడిన ప్రయాణాలకు అనుమతి ఇచ్చింది. కొంతమందికి మాత్రమే రాయితీ టికెట్లు జారీ చేస్తామని, ఇతర కేటగిరీ రాయితీలు ఉండబోవని తేల్చింది. 
 
విద్యార్థులతో పాటు నాలుగు వర్గాల దివ్యాంగులు, 11 రకాల రోగులకు ఈ ధరలు వర్తిస్తాయని, ఎంతో అత్యవసరమైతేనే వారు ప్రయాణాలు చేయాలని సూచించింది. అంతేకానీ, అనవసరంగా ప్రయాణం చేయడానికి వీల్లేదని చెప్పుకొచ్చింది. 
 
ఇకపోతే, న్యూఢిల్లీ నుంచి దేశంలోని 15 ముఖ్య నగరాలకు ఈ ప్రత్యేక రైలు సర్వీసులు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రయాణికులు విధిగా నిబంధనలను పాటించాలని ఆదేశించింది. రైలులో ముందుగా బుక్ చేసుకుంటేనే ఆహారం, నీటిని అందిస్తామని తేల్చి చెప్పింది. బెడ్ షీట్లు, దిండ్ల సరఫరా ఉండబోదని, కర్టెన్లను అన్నింటినీ తొలగిస్తామని పేర్కొంది.
 
కనీసం గంటన్నర ముందుగానే ప్రయాణికులు స్టేషన్‌కు చేరుకోవాలని, మాస్క్ ధరించడం తప్పనిసరని వెల్లడించింది. తదుపరి ప్రకటన వచ్చేంత వరకూ రెగ్యులర్ రైళ్లు, మెయిల్ / ఎక్స్‌ప్రెస్ సబర్బన్ సర్వీసులు నడవబోవని స్పష్టంచేసింది. అలాగే, ఈ ప్రత్యేక రైళ్ళలో ఎలాంటి అనారోగ్యం లేకుండా ఉంటేనే ప్రయాణం చేసేందుకు అనుమతినిస్తారు.