1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 జులై 2021 (10:41 IST)

గవర్నర్ కోటాలా ఆనందయ్యను ఎమ్మెల్సీ చేయండి.. సీఎస్ దాస్‌కు లేఖ

కరోనా కష్టకాలంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడిన నెల్లూరు జిల్లా కృష్ణాపట్నంకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యకు ఎమ్మెల్సీ ఇవ్వాలని వెన్నెల ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఏపీ హైకోర్టు న్యాయవాది సుంకర నరేష్ కోరారు. గవర్నర్ కోటాలో ఆనందయ్యను ఎమ్మెల్సీగా చేయాలని ఆయన గవర్నర్‌కు ఓ విజ్ఞప్తి లేఖ రాశారు. ఈ అంశాన్ని పరిశీలించాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు గవర్నర్ కార్యాలయం కూడా లేఖ రాయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోన్న సమయంలో ఆయుర్వేద మందు తయారీ చేసి వార్తా పత్రికల్లో ప్రధాన శీర్షికలకెక్కిన ఆనందయ్య... ఆయన మందు కొంతకాలం ఆగిపోవడం, కోర్టు వరకు వ్యవహారం వెళ్లడంతో చాలా రోజులు ఆయన వార్తలు ఆసక్తికరంగా మారాయి. 
 
మొత్తానికి ఏపీ సర్కార్‌ అనుమతి ఇవ్వడంతో మందు తయారు చేసి మళ్లీ పంపిణీ చేశారు. ఈ సమయంలో ఆనందయ్యకు చాలా మంది మద్దతుగా నిలిచారు. ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలంటూ ఓ సంస్థ గవర్నర్‌కు సుంకర నరేష్ విజ్ఞప్తి చేశారు 
 
కరోనా రోగులకు ఆయుర్వేద వైద్యంతో చికిత్స చేస్తోన్న ఆనందయ్యకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ను వెన్నెల ఫౌండేషన్‌ కోరింది. ఇక, తమ వద్దకు వచ్చిన వినతిని పరిశీలించాలని సీఎస్ ఆదిత్యనాథ్‌ దాస్‌కు గవర్నర్ కార్యాలయం కూడా లేఖ రాయడం ఇపుడు గమనార్హం. 
 
తన వద్దకు వచ్చిన వినతిని ప్రభుత్వానికి పంపాలని.. గవర్నర్ ఆదేశాల మేరకు సీఎస్‌కు లేఖ రాశారు గవర్నర్ సెక్రటరీ.. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.