శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 అక్టోబరు 2019 (15:52 IST)

దేశంలో జైషే ఉగ్రవాదులు.. బృందాలుగా విడిపోయి విధ్వంసానికి ప్లాన్

పాకిస్థాన్ ప్రేరేపిత జేషే మహ్మద్ ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారు. వీరంతా చిన్నచిన్న బృందాలుగా విడిపోయి దేశంలో విధ్వంసానికి ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో దేశ వ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణ రద్దుతో పాకిస్థాన్‌, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు రగలిపోతున్నారు. భారత్‌తో ప్రతీకారానికి రగిలిపోతున్నారు. 
 
ఈ నేపథ్యంలో సరిహద్దు వెంబడి దాదాపు 500 మంది ఉగ్రవాదులు పొంచి ఉన్నారని ఇటీవలే ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ కూడా హెచ్చరించారు. ఇపుడు ఇంటెలిజెన్స్ బ్యూరో తాజా హెచ్చరికలు చేసింది. పాకిస్థాన్ వైపు నుంచి జైషే మహ్మద్ ఉగ్రవాదులు చిన్న బృందాలుగా విడిపోయి భారత్‌లో చొరబడ్డారని, వారిలో నలుగురితో కూడిన ఓ టీమ్ దేశ రాజధాని ఢిల్లీలో అడుగుపెట్టిందన్నది నిఘా వర్గాల ద్వారా అందిన సమాచారం.
 
జైషే మహ్మద్ ఉగ్రవాదులు వరుస దాడులకు పాల్పడాలన్న లక్ష్యంతో భారత్‌లో ప్రవేశించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఆత్మాహుతి దాడులకు దిగే అవకాశాలున్నట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో, ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో సాయుధ బలగాలను మోహరించారు. అనుమానాస్పదంగా కనిపిస్తున్న వ్యక్తులను నిశితంగా సోదాలు చేస్తున్నారు.