బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 అక్టోబరు 2019 (09:49 IST)

మోడీ వైఖరిపై ప్రజలు చితక్కొట్టడం ఖాయం : బీజేపీ ఎమ్మెల్యే

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుసరిస్తున్న వైఖరి వల్ల ప్రజా ప్రతినిధులను ప్రజలు చితక్కొట్టడం ఖాయమని బీజేపీ ఎమ్మెల్యే బసన గౌడ యత్నాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాల పట్ల ఒక విధంగా, ఎన్నికలు లేని రాష్ట్రాల పట్ల మరో విధంగా మోడీ వ్యవహరిస్తున్నారంటూ బాహాటంగానే విమర్శించారు. పైగా, ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలకు తమ ముఖాలను కూడా చూపించలేమని ఆయన వాపోయారు. 
 
ఇంతకీ ఆయన ఎలా ఎందుకు అలా అసహనం వ్యక్తం చేయాల్సి వచ్చిందో ఓసారి తెలుసుకుందాం. ఉత్తరభారతంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటితో బీహార్ రాష్ట్రం పూర్తిగా నీట మునిగిపోయింది. అపార నష్టం వాటిల్లింది. ఈ వరద పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. 'వరదలతో అల్లాడుతున్న బీహార్‌కు అండగా ఉంటామంటూ' మోడీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
అంతకుముందు ఇలాంటి వరదలే కర్నాటక రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. అపార నష్టాన్ని కలిగించాయి. వీటిపై నరేంద్ర మోడీ ఇప్పటివరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీంతో కర్నాటకలోని అధికార బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడకు కోపం వచ్చింది. ప్రధాని మోడీ ట్వీట్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బీహార్ వరదలపై ఆరా తీసిన మోడీ కర్ణాటక గురించి ఒక్క మాటైనా మాట్లాడకపోవడం ఏంటంటూ ప్రశ్నించారు. 
 
ముఖ్యంగా, 25 మంది ఎంపీలను ఇచ్చిన కర్ణాటకను మోడీ పట్టించుకోకపోవడం దారుణమన్న బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ యత్నాల్.. ఇలాగైతే కష్టమని చెప్పేశారు. కర్ణాటకను పట్టించుకోకపోతే దక్షిణ భారతదేశంలో పార్టీ పట్టుకోల్పోతుందని బాహాటంగానే చెప్పేశారు. ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదని, ప్రజల మనోభావాలు, భావోద్వేగాలకు సంబంధించినదని బసనగౌడ పేర్కొన్నారు. 
 
బీహార్ వరదలపై ట్వీట్ చేసిన మోదీ కర్ణాటక గురించి ఒక్క ట్వీట్ కూడా చేయకపోవడం దారుణమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లోకి వెళ్లడం కష్టమన్నారు. ప్రజలకు తమ ముఖాలు ఎలా చూపించాలని ప్రశ్నించారు. కర్ణాటకలో ఎన్నికలు లేవనే రాష్ట్రం గురించి మోదీ పట్టించుకోవడం లేదన్న ప్రచారం జరుగుతోందన్నారు. ఏది ఏమైనా ముందు ప్రజలు, ఆ తర్వాత రాష్ట్రం, అటు తర్వాతే పార్టీ అని తెగేసి చెప్పారు. కర్ణాటకలో ప్రస్తుత పరిస్థితి గురించి పార్టీ ఎంపీలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని, లేదంటే తాము ఎమ్మెల్యేలమని, ఎంపీలమని చెబితే ప్రజలు చితక్కొట్టడం ఖాయమని బసనగౌడ ఆవేదన వ్యక్తం చేశారు.