1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Justice NV Ramana is the 48th Chief Justice of India

భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ

Justice NV Ramana
48వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకట రమణ నేడు రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణం స్వీకారం చేయించనుండగా.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్రమంత్రులు, న్యాయమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల, జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు.
 
భారత 48 ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ నేడు ప్రమాణం స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాల్లో ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకార మహోత్సవం జరగనుంది. సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణతో రాష్ట్రపతి రామ్నాథ్ కొవింద్... ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. 
 
కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమానికి కొద్దిసంఖ్యలోనే అతిథులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్రమంత్రులు, న్యాయశాఖ ఉన్నతాధికారులతో పాటు జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది.
 
నేటి నుంచి 2022 ఆగస్టు 26 వరకు అంటే 16 నెలల పాటు సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన రెండో తెలుగు వ్యక్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నిలిచారు. 1966- 67 లో జస్టిస్ కోకో సుబ్బారావు సీజేఐ పనిచేశారు. అర్ద శతాబ్దం తర్వాత మళ్లీ తెలుగు వ్యక్తి అత్యున్నత న్యాయం పీఠం ఎక్కబోతున్నారు. 
 
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణ అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు.1983లో న్యాయవాదిగా నల్లకోటు వేసుకున్న జస్టిస్ రమణ.. 2000 సంవత్సరంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా.. ఆ తర్వాత దిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా వ్యవహరించారు. 
 
2014 ఫిబ్రవరిలో సర్వోన్నత న్యాయస్థానానికి పదోన్నతి పొందారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జస్టిస్ ఎన్వీ రమణపై పలు కీలక అంశాలు ఆయన ముందుకు రాబోతున్నాయి. అపరిష్కృత కేసుల విచారణ వేగవంతానికి న్యాయవ్యవస్థ మౌలిక వసతులను బలోపేతం చేయాల్సి ఉంది.
 
జస్టిస్ ఎన్వీ రమణ సీజేఐగా పని చేయనున్న కాలంలో 2021 చివరి నాటికి పదవీ విరమణ చేసే వారితో కలిపి 13 సుప్రీంకోర్టు న్యాయమూర్తుల స్థానాలు ఖాళీగా ఉండనున్నాయి. వాటితో పాటు వచ్చే ఏడాది మరో నలుగురు జడ్జిలు రిటైర్ కానున్న నేపథ్యంలో ఆ స్థానాల భర్తీ చేయాల్సి ఉంటుంది. 
 
హైకోర్టుల్లోనూ పేరుకుపోయిన పెండింగ్ కేసుల విచారణ ముగింపునకు తగినవిధంగా న్యాయమూర్తుల నియామకం చేయడంతో పలు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తున్న వేళ సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు చేపడుతున్నారు. 
 
కరోనా నియంత్రణ అంశంపై సుమోటో కేసును సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ విచారణ జరుపబోతున్నారు. దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పలు సుమోటో కేసులు విచారించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ప్రస్తుతం ఆక్సిజన్ కొరత, కరోనా నియంత్రణకు జాతీయ ప్రణాళిక, వ్యాక్సినేషన్ అంశాలను వినబోతున్నారు. 
 
వాటితో పాటు రఫెల్ ఒప్పందంపై ఇటీవల దాఖలైన పిటిషన్లు, ఆరాధాన హక్కు చట్టంపై పిటిషన్లు, సీఏఏ, ఎన్‌ఆర్‌సీ వంటి పిటిషన్లు సీజేఐ ధర్మాసనం ముందుకు వచ్చే అవకాశం ఉంది.
About Writer
ఎం
తర్వాతి కథనం
CoronaVirus ఉసురు తీస్తోన్న మహమ్మారి: 3,46,786 కొత్త కేసులు, 2,624 మరణాలు