1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 ఏప్రియల్ 2021 (10:27 IST)

డ్రైవ్‌-ఇన్‌-కోవిడ్‌ పరీక్షా కేంద్రాలు.. హైదరాబాదులో మొదటిసారిగా..?

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో డ్రైవ్-ఇన్- రెస్టారెంట్ల తరహాలో డ్రైవ్‌-ఇన్‌-కొవిడ్‌ పరీక్షా కేంద్రాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఆ కేంద్రానికి వెళ్లి కారు దిగకుండానే కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకుని నిర్దేశించిన గడువులోపు ఫలితం పొందవచ్చు. హైదరాబాద్‌లో మొదటిసారిగా ఇలాంటి కేంద్రాన్ని అపోలో డయాగ్నస్టిక్స్‌ సంస్థ శుక్రవారం హైటెక్‌ సిటీ ప్రాంతంలో అందుబాటులోకి తీసుకువచ్చింది. 
 
మాదాపూర్‌లోని మెరిడియన్‌ స్కూల్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో ప్రతి రోజూ (ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు) 250 మందికి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయనున్నారు. పరీక్ష కోసం ఇక్కడికి వచ్చిన తరువాత సెల్‌ఫోన్‌ ద్వారా క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి అందులో వివరాలు నమోదు చేయాలి. వెంటనే సెల్‌ఫోన్‌లో టోకెన్‌ జారీ అవుతుంది. 
 
తర్వాత పరీక్ష రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. టోకెన్‌ నంబర్‌ ఆధారంగా డయాగ్నస్టిక్స్‌ కేంద్రం నిపుణులు కారు వద్దకు వచ్చి నమూనా సేకరిస్తారు. 48 నుంచి 72 గంటల్లో ఫలితాన్ని ఆన్‌లైన్‌లో అందిస్తారు. ఇలాంటి కేంద్రాలను నగరంలో మరిన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.