గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 30 అక్టోబరు 2019 (12:08 IST)

పొంచివున్న పెనుముప్పు... ముంబై మునిగిపోతుందా? క్లైమేట్ సెంట్రల్ ఏమంటోంది?

ముంబై మహానగరానికి పెను ముప్పు పొంచివుంది. ఫలితంగా ముంబై నగరం మునిగిపోతుందా అనే సందేహం ప్రతి ఒక్కరినీ వెంటాడుతోంది. గ్లోబల్ వార్మింగ్ పుణ్యమాని ప్రపంచ వ్యాప్తంగా మంచుకరిగిపోతోంది. దీంతో సముద్రమట్టాలు గణనీయంగా పెరుగుతున్నాయి. దీని కారణంగా 2050 నాటికి పాత అంచనాల కంటే మూడు రెట్లు ఎక్కువ ప్రజలు ప్రభావితమవబోతున్నారు. మన దేశం విషయానికి వస్తే ఆర్థిక రాజధాని ముంబైకి పెను ప్రమాదం పొంచి ఉంది. 
 
ఈ వివరాలను అమెరిలోని న్యూజెర్సీ కేంద్రంగా పని చేస్తున్న 'క్లైమేట్ సెంట్రల్' అనే సంస్థ వెల్లడించింది. ఈ సంస్థ చేసిన అధ్యయనానికి సంబంధించిన రీసెర్చ్ పేపర్... నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో తాజాగా ప్రచురితమైంది. ఈ అధ్యయనం మేరకు ప్రస్తుతం 15 కోట్ల మంది నివసిస్తున్న భూభాగం... ఈ శతాబ్దం మధ్య కాలం (2050) నాటికి సముద్ర తీరాన్న తాకే ఎత్తైన అలల కంటే తక్కువ ఎత్తులో ఉండబోతోంది. అంటే... ఈ ప్రాంతాలను సముద్రం ఆక్రమించుకోబోతోంది. ఇదేసమయంలో ముంబైకి పెను ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా చరిత్రాత్మకమైన డౌన్‌టౌన్ తీవ్రంగా ప్రభావితం కానుంది. పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది.
 
ఇదే అంశంపై ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అనే సంస్థకు చెందిన డీనీ లోనెస్కో మాట్లాడుతూ, అన్ని దేశాలు ఇప్పటి నుంచే ముందు చూపుతో చర్యలు చేపట్టాలని సూచించారు. ముంపుకు గురికాబోతున్న ప్రాంతాల్లోని ప్రజలకు ఇతర ప్రాంతాలకు తరలించే ప్రక్రియను ఇప్పటి నుంచే చేపట్టాలని చెప్పారు. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని... విపత్తు ముంచుకొస్తోందనే విషయం మనందరికీ తెలుసని ఆయన హెచ్చరించారు.