శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 10 డిశెంబరు 2020 (20:28 IST)

సోమేశ్వర్ బీచ్ ఒడ్డు చూసి హనీమూన్ రద్దు చేసుకున్న కొత్త జంట, ఎందుకు?

పెళ్లయి పదిరోజులైంది. హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేసుకుందాం అంటూ ఆ కొత్త జంట కర్నాటక లోని సోమేశ్వర్ బీచ్ వైపు సరదాగా వెళ్లారు. ఐతే బీచ్ ఒడ్డున వున్న చెత్తాచెదారం చూసి తమ మనసు మార్చుకున్నారు. కర్నాటకకు చెందిన కొత్తగా పెళ్లి చేసుకున్న జంట అనుదీప్ హెగ్డే, మినుషా కాంచన్ హనీమూన్ కోసం వెళ్ళకుండా బీచ్ శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నారు.
 
కర్ణాటకలోని బైందూర్‌లో అనుదీప్ హెగ్డే ఒక డిజిటల్ స్టూడియోను నడుపుతున్నాడు. అతడు ఔషధాల తయారీ కంపెనీలో పనిచేస్తున్న మినుషాను వివాహం చేసుకున్నాడు. హనీమూన్ వెళ్దామని అనుకున్నారు. ఈలోగా సోమేశ్వర్ బీచ్‌ను సందర్శించేందుకు వెళ్లారు.
 
బీచ్ వద్ద ఆ దృశ్యాలు చూసి ఆవేదన చెందారు. అది ఓ డంప్‌లా మారిందని, వ్యర్థాలు, ప్లాస్టిక్ వస్తువులతో నిండిపోయిందని అనుదీప్- మినుషా బాధ పడ్డారు. తమ హనీమూన్ కంటే ముదుగా ప్రకృతిని పరిశుభ్రం చేయాలని తమ హనీమూన్‌ను రద్దు చేసుకుని బదులుగా బీచ్‌ను శుభ్రం చేశారు.
 
అనుదీప్ తాము చేసినదంతా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో షేర్ చేసుకున్నారు. ఇప్పటివరకు 800 కిలోల కంటే ఎక్కువ వ్యర్థాలను బీచ్ నుండి తొలగించినట్లు చెప్పారు. ఐతే తాము బీచ్ వద్ద వ్యర్థాలను తొలగించే పనికి పూనుకున్న తర్వాత తమతో కలిసి మరికొందరు పాల్గొన్నారనీ, వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వెల్లడించాడు. అతడి పోస్టులు ఇపుడు వైరల్ అయ్యాయి. వారు చేస్తున్న పనికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.