శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : సోమవారం, 23 సెప్టెంబరు 2019 (18:02 IST)

ఒకే దేశం... ఒకే గుర్తింపు కార్డు : హోం మంత్రి అమిత్ షా

ఒకే దేశం... ఒకే భాష. ఒకే దేశం.. ఒకే పన్ను. ఇది కేంద్రంలోని బీజేపీ సర్కారు అనుసరిస్తున్న విధానాలు. ఇపుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో నివశించే పౌరులందరికీ ఒకే దేశం.. ఒకే గుర్తింపు కార్డును తీసుకురానుంది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. 
 
ఈ కార్డు అన్ని అవసరాలకూ ఉపయోగపడేలా దేశమంతా ఒకే గుర్తింపు కార్డు తీసుకురావాలనుకుంటున్నట్టు సూత్రప్రాయంగా ఆయన తెలిపారు. ఆధార్, పాస్‌పోర్ట్, ఓటర్ కార్డు, బ్యాంక్ ఖాతా, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా... ఈ అవసరాలన్నింటికీ ఒకే బహుళ ప్రయోజన గుర్తింపు కార్డు ఉంచుకోవచ్చని, అది ఆచరణ సాధ్యమని అన్నారు. ఇందువల్ల వేర్వేరు డాక్యుమెంటేషన్ల అవసరం ఉండదన్నారు. ఇదే ఢిల్లీలో రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా, సెన్సస్ కమిషనర్ నూతన ప్రధాన కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఇందులో అమిత్‌షా పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, 2021 జనాభా లెక్కింపులో మొబైల్ యాప్‌ను ఉపయోగిస్తామని, జాతీయ జనాభా రిజిస్టర్‌ను కూడా తయారు చేస్తామన్నారు. ఒక వ్యక్తి చనిపోతే ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అయ్యే వ్యవస్థను తీసుకురావాలనుకుంటున్నట్టు చెప్పారు. 
 
'ఎన్నికల జాబితా అప్‌డేషన్‌లో వ్యక్తి జనన, మరణ రిజిస్టేషన్‌‌ను ఎందుకు అనుసంధానం చేయకూడదు? 18 ఏళ్లు వచ్చేసరికి సదరు వ్యక్తులను ఎన్నికల జాబితాల్లో చేర్చడం లేదా? అదేవిధంగా, మరణాన్ని సదరు కుటుంబం రిజిస్టర్ చేసినప్పుడు, ఓటర్ల జాబితా నుంచి మృతిచెందిన ఓటరును ఆటోమేటిక్‌గా తొలగించడం ఎందుకు సాధ్యం కాదు?' అని అమిత్ షా ప్రశ్నించారు. ఈ ప్రశ్నలందరికీ సమాధానంగా ఒకే గుర్తింపు కార్డును తీసుకొస్తామని ఆయన తెలిపారు.