శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (15:41 IST)

కాశ్మీరమంతా ప్రశాంతం.. ఒక్క తూటా పేలలేదు.. ఒక్క ప్రాణం పోలేదు... అమిత్ షా

కాశ్మీర్ లోయ అంత ప్రశాంతంగా ఉందనీ అక్కడ ఒక్క తూటా పేలలేదనీ, ఒక్క ప్రాణం పోలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుర్తు చేశారు. ముఖ్యంగా జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో అమలు చేస్తూ వచ్చిన అధికరణ 370 రద్దు చేసిన ఆగస్టు 5వ తేదీ నుంచి ఇప్పటివరకు పరిస్థితులన్నీ ప్రశాంతంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. కాశ్మీర్ అంతా ప్రశాంతంగా ఉందన్నారు. 
 
తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం 2016లో మెరుపుదాడులు (సర్జికల్ స్ట్రైక్స్) చేసినప్పుడు యాధాలాపంగా జరిగినట్టుగానే చాలామంది భావించారని, అయితే ఇటీవల 370 అధికరణ రద్దు తర్వాత దేశ రక్షణ విధానాలపై వారందరికీ చాలా స్పష్టత వచ్చిందన్నారు. మెరుపుదాడులు, వాయిదాడులు ప్రజలకు సంతోషం కలిగించి ఉండవచ్చనీ, అయితే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే మాత్రం చాలా ధైర్యం కావాలన్నారు. ఆ నిర్ణయం తర్వాత భారత్‌పై ప్రపంచ దేశాల వైఖరిలో మార్పు వచ్చిందని గుర్తుచేశారు.
 
గత కాంగ్రెస్ లేదా యూపీఏ హయాంలో ప్రతిరోజూ అవినీతి, సరిహద్దుల్లో అభద్రత, సైనికుల తలలు నరికివేత, మహిళలకు కొరవడిన రక్షణ, ప్రతిరోజూ రోడ్లపైకి జనం వచ్చి నిరసనలు తెలపడం వంటి వార్తలు చోటుచేసుకుంటూ ఉండేవని అమిత్‌షా విమర్శించారు. ప్రధాని ఒకరు ఉన్నప్పటికీ ఏ ఒక్కరూ ఆయనను ఖాతరు చేయకుండా తామే ప్రధానులుగా భావించుకుని పాలన సాగించారని కాంగ్రెస్ హయాంపై చురకలు వేశారు. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా మోడీ సర్కార్ ఓటు బ్యాంకును ఆశించకుండా ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటూవచ్చారని అమిత్ షా చెప్పుకొచ్చారు.