శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 19 అక్టోబరు 2019 (09:11 IST)

ఆర్టీసీ సమ్మె : తెలంగాణలో రాష్ట్ర బంద్.. డిపోలకే బస్సులు పరిమితం

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మ శనివారానికి 15వ రోజుకు చేరుకుంది. మరోవైపు, తమ డిమాండ్ సాధన కోసం ఆర్టీసీ కార్మికులు శనివారం రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. వీరికి అన్ని రాజకీయ పార్టీల నేతలతో పాటు ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్లు కూడా మద్దతు ప్రకటించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. 
 
అన్ని బస్సు డిపోల ముందు బైఠాయించి కార్మికులు నిరసన తెలుపుతున్నారు. ఖమ్మం, సత్తుపల్లి, మధిర బస్ డిపో‌ల ముందు కార్మికుల ఆందోళన నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా కార్మికుల నినాదాలు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. 9 డిపోల నుంచి ఆర్టీసీ బస్సులు బయటకు రాలేదు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు విధులకు హాజరుకాలేదు.
 
సిద్దిపేట జిల్లాలోనూ అదే పరిస్థితి కొనసాగుతోంది. తెల్లవారు జామున డిపో వద్దకు చేరుకున్న కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని అన్ని డిపోల వద్ద పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించాయి. తాత్కాలిక డ్రైవర్లు సైతం విధులకు హాజరు కాలేదు. మహబూబ్ నగర్ జిల్లాలో ఆర్టీసీ డిపోల ముందు బైఠాయించి ఆర్టీసీ కార్మికులు ధర్నా చేపట్టారు. కాంగ్రెస్, బీజేపీ, ప్రజా సంఘాల నాయకులు ధర్నాకు మద్దతు తెలిపారు. హైదరాబాద్‌లోని జూబ్లీ బస్టాండ్ వద్ద ఆర్టీసీ సమ్మెలో టీటీడీపీ సీనియర్ నేత రావుల పాల్గొననున్నారు.
 
ఇదిలావుండగా, ఆర్టీసీ కార్మికులకు సంఘీభావంగా జేబీఎస్ వద్ద బంద్‌లో పాల్గొనడానికి వచ్చిన కోదండరామ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపాలన్నారు. ప్రభుత్వం అక్రమ అరెస్ట్‌లను కోదండరాం తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. వెంటనే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలన్నారు.
 
మరోవైపు, దాదాపు 15 రోజులుగా బస్సుల బంద్‌తోనే అష్టకష్టాలు పడుతున్న సామాన్యులపై ట్యాక్సీలు, క్యాబ్‌ల సమ్మె రూపంలో శనివారం నుంచి మరో పిడుగు పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 50 వేల మంది ట్యాక్సీ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని రెండున్నర నెలలుగా రాష్ట్ర రవాణా మంత్రిని కోరుతున్నా స్పందన లేకపోవడంతో సమ్మె అనివార్యమైందని తెలంగాణ ట్యాక్సీ డ్రైవర్ల జేఏసీ చైర్మన్‌ షేక్‌ సలావుద్దీన్‌ తెలిపారు. 
 
తాము నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఉబర్‌, ఓలా వంటి సంస్థల నుంచి చర్చలకు పిలుపు వస్తుందని ఆశించామని.. కానీ, శుక్రవారం రాత్రి వరకూ తమను ఎవరూ సంప్రదించలేదని ఆయన వివరించారు. క్యాబ్‌ డ్రైవర్లు కూడా 19వ తేదీ నుంచి సమ్మెకు వెళ్తున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడతారని శుక్రవారం రాష్ట్ర హైకోర్టు చెప్పినా కూడా ప్రభుత్వం తమను సంప్రదించక పోవడం బాధిస్తోందన్నారు. 
 
ప్రజలను ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం ఎంత మాత్రం కాదని, తమ సమస్యల పరిష్కారానికి గత్యంతరం లేని పరిస్థితుల్లోనే సమ్మెకు వెళ్తున్నామని ఆయన వివరించారు. సమ్మె వద్దంటూ ప్రజల నుంచి తమకు అనేక విజ్ఞప్తులు వస్తున్నాయని, ప్రజలకు కలిగిస్తున్న అసౌకర్యానికి చింతిస్తున్నామని సలావుద్దీన్‌ చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆహ్వానిేస్త చర్చలకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.