శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (16:31 IST)

హైదరాబాద్‌ కేంద్రంగా భూకంపం - దేశంలో రాజకీయ ప్రకంపనలు : కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ హైదరాబాద్ వేదికగా జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓ గట్టి హెచ్చరిక చేశారు. హైదరాబాద్‌ కేంద్రంగా భూకంప పుట్టిస్తానని, దాని ధాటికి దేశవ్యాప్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ హైదరాబాద్ వేదికగా జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓ గట్టి హెచ్చరిక చేశారు. హైదరాబాద్‌ కేంద్రంగా భూకంప పుట్టిస్తానని, దాని ధాటికి దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు మొదలవుతాయన్నారు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న తెరాస ప్లీనరీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, దేశ రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి తెరాసకు ఉందన్నారు. తెలంగాణ ప్రజల దీవెనలు.. ఆశీస్సులతో ముందుకు పోతాం. ఈ గులాబీ పరిమళాలను దేశంలోని మారుమూల గ్రామాల్లోకి తీసుకుపోతామన్నారు.
 
ఈ దేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం. కావాల్సినన్ని వనరులు ఉన్నాయి. డబ్బులు ఉన్నాయి. అద్భుతమైన నదులు, భూములు ఉన్నాయి. కానీ నాయకుల్లో అవగాహన శక్తి లేకనే ఈ దుర్భరపరిస్థితి నెలకొని ఉందన్నారు. దేశ తలసరి ఆదాయం పెరగాలన్నారు. రైతుల ఆత్మహత్యలు తగ్గాలి. బాధ్యతగల రాష్ట్రంగా దేశం బాగుకోసం ఉద్యమిస్తామన్నారు. దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తానని కేసీఆర్ ఉద్ఘాటించారు. 
 
దేశ ప్రజలను కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మోసం చేస్తున్నాయి. రాష్ట్రాలనుమున్సిపాలిటీల కంటే హీనంగా చూస్తున్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, పట్టాణాభివృద్ది, తాగునీటి వసతి, ఆరోగ్యం కేంద్రం వద్ద ఎందుకు? అని నిలదీశారు. ప్రధానమంత్రి గ్రామసడక్ యోజన.. మీకు అవసరమా? రోడ్లు వేసేందుకు సర్పంచ్, ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ లేదా? అని ప్రశ్నించారు. 
 
అంతేకాకుండా, ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే దేశంలో 40 కోట్ల ఎకరాలకు సాగు నీరు అందిస్తామన్నారు. మరో ఆరేడు ఏళ్లలో ఆ నీటిని ప్రతి ఎకరాకు అందే విధంగా ప్రణాళిక రూపొందించనున్నట్లు చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల వల్లే దేశంలో నీటి యుద్ధాలు జరుగుతున్నాయని, రైతాంగం సమస్యలను పరిష్కరించేందుకు బృహత్తర ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ప్రతి ఎకరాకు, ప్రతి పంటకు, ప్రతి రైతుకు నీరు అందించే విధంగా విధానాలను తయారు చేస్తున్నామన్నారు. 
 
దేశవ్యాప్తంగా 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, ప్రకృతిపరకంగా దేశానికి ఆ నీరు లభిస్తోందని, కానీ అందులో 40వేల టీఎంసీలను దేశవ్యాప్తంగా ఉన్న 40 కోట్ల సాగు భూమికి సరఫరా చేయవచ్చు అని కేసీఆర్ అన్నారు. ధర్మం ప్రకారం, న్యాయం ప్రకారం నీళ్లను పంచితే అన్ని రాష్ట్రాలకు 40వేల టీఎంసీలు సరిపోతాయన్నారు. కానీ గత పాలకులు ఆ పని చేయలేదన్నారు. దేశ‌వ్యాప్తంగా 25 వేల టీఎంసీల మిగులు జ‌లాలు ఉన్న‌ట్లు సీఎం చెప్పారు. 14 ఏళ్లు గ‌డిచినా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇంకా నీటి వివాదాన్ని తేల్చలేకపోయిందని ఆయన గుర్తు చేశారు. దీనికంతటికీ దేశాన్ని పాలించిన, పాలిస్తున్న పాలకులే కారణమని కేసీఆర్ ఆరోపించారు.