శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్

తెలంగాణకు కొత్త సచివాలయం.. హంగులేంటో తెలిస్తే నోరెళ్ళబెట్టాల్సిందే...

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజాం కాలంనాటి పాత సచివాలయాన్ని కూల్చి, దాన్ని స్థానంలో కొత్త సచివాలయ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ పనులు ఆ రాష్ట్ర హైకోర్టు అనుమతితో మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. అలాగే, కొత్త సచివాలయ భవన నమూనాను కూడా తెలంగాణ సీఎంవో రిలీజ్ చేసింది. ఈ కొత్త భవనం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్ల మేరకు నిధులు వెచ్చించనుంది. ఇందులో అత్యాధునిక సౌకర్యాలను కల్పించనున్నారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా ఈ భవన నిర్మాణం సాగనుంది. 
 
ఈ భవాన్ని మొత్తం ఆరు అంతస్తుల్లో నిర్మించనున్నారు. ఎటువంటి వాస్తు దోషం లేకుండా ఆరు అంతస్తుల్లో అత్యంత భద్రతా ప్రమాణాలతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీర్ఘ చతురస్రాకారంలో కొత్త సచివాలయం రూపుదిద్దుకోనుంది.
 
మొత్తం 27 ఎకరాలున్న ఈ స్థలంలో 20 శాతాన్ని మాత్రమే భవన నిర్మాణానికి ఉపయోగిస్తుండగా, మిగిలిన ప్రదేశంలో ల్యాండ్ స్కేప్‌లు, రాష్ట్ర అధికార పుష్షమైన తంగేడు పువ్వు ఆకారంలో ఫౌంటెయిన్లు నిర్మిస్తారు. అలాగే, ఒకేసారి 800 కార్లు పార్కు చేసుకునేలా, ఒకేసారి రెండు హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ నెలాఖరులో పనులు ప్రారంభంకానున్నాయి.
 
రాజప్రసాదంలా ఆకట్టుకునేలా ఉన్న భవన నమూనాను ముంబైకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్‌ కాంట్రాక్టర్‌తోపాటు మరికొందరు కూడా భవన నమూనాలను డిజైన్ చేశారు. మొత్తం పది నమూనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ చెన్నైకి చెందిన ఆస్కార్ అండ్ పొన్నీ సంస్థ రూపొందించిన నమూనాకు సూత్రప్రాయంగా అంగీకరించారు. ఫ్రాన్స్‌లోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ భవనం స్ఫూర్తితో దీనిని డిజైన్ చేశారు.