శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 జులై 2020 (10:36 IST)

సింగిల్ బెడ్రూం ఇంటికి రూ.25 లక్షల కరెంట్ బిల్లు... యజమాని గుండె గుభేల్

కరోనా వైరస్ కష్టాలతో పాటు... కరెంట్ బిల్లులు ఇంటి యజమానులను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. అసలే కరోనా కష్టకాలంలో జీవనోపాధిని కోల్పోయిన ప్రజలకు.. ఇంటికి కరెంట్ బిల్లులు తేరుకోలేని షాకులిస్తున్నాయి. తాజాగా ఓ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్‌కు ఏకంగా రూ.25 లక్షల కరెంట్ బిల్లు వచ్చింది. ఈ బిల్లును చూసిన యజమానికి గుండె గుభేల్ మనిపించింది. ఆ తర్వాత చేసిన తప్పును తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు... కొత్త మీటరు బిగించి, చేసిన తప్పును సరిదిద్దుకున్నారు. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్‌లోని ఓ సింగిల్ బెడ్రూం ఇంటికి ఏకంగా రూ. 25 లక్షల పైచిలుకు బిల్లు ఇచ్చింది. నగరంలోని లాలాపేట జనప్రియ అపార్ట్‌మెంట్‌లోని సింగిల్ బెడ్‌ రూం ప్లాట్‌లో కృష్ణమూర్తి అనే వ్యక్తి నివసిస్తున్నారు. 
 
ఆదివారం ఆయన ఇంటికొచ్చిన విద్యుత్ సిబ్బంది బిల్లు తీసి ఆయన చేతిలో పెట్టారు. అందులో 121 రోజుల్లో 3,45,007 యూనిట్ల విద్యుత్ వాడినందుకుగాను రూ.25,11,467 బిల్లు వేశారు.
 
అది చూసిన కృష్ణమూర్తి దానిని పట్టుకుని తార్నాకలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బిల్లు చూసిన అధికారులు మీటరులో లోపం ఉందంటూ తీరిగ్గా సెలవిచ్చారు. వెంటనే కొత్త మీటరు బిగించి రూ. 2,095 బిల్లు చేతిలో పెట్టడంతో కృష్ణమూర్తి ఊపిరి పీల్చుకున్నారు.